తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి.. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఢీ కొట్టిన నాయకుడు.. తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేసిన నేత.. ఎన్ని అవాంతరాలు.. ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ.. ఏమాత్రం జంకకుండా, వెరవకుండా పోరాడారు రేవంత్ రెడ్డి. ఉద్యమ నేతగా.. తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా.. పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న కేసీఆర్ను దూకుడుగా ఎదుర్కొన్నారు. అధిష్టానం నమ్మి పార్టీ పగ్గాలు చేతికిస్తే.. ఆ నమ్మకాన్ని వొమ్ము చేయకుండా పార్టీని విజయ తీరాలకు చేర్చారు. ప్రత్యర్థులకు చుక్కుల చూపించి.. కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చారు.
2017 అక్టోబర్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లను అధిష్టానం నియమించగా.. అందులో ఒకరు రేవంత్ రెడ్డి. అదే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలొచ్చాయి. కాంగ్రెస్ పార్టీ తరుపున కొడంగల్ నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అయితే ఏ మాత్రం వెనుకడగు వేయకుండా 2019లో వచ్చిన లోక్సభ ఎన్నికల్లో మాల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి రేవంత్ రెడ్డి గెలుపొందారు.
2021లో అధిష్టానం రేవంత్ రెడ్డిని నమ్మి పార్టీ పగ్గాలు చేతికిచ్చింది. అధిష్టానం నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు రేవంత్ రెడ్డి రేయింబవళ్లు చెమటోడ్చారు. అష్టకష్టాలు పడి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. జైలు కెళ్లినా.. ఓటమి పాలయినా ఏ మాత్రం జంకకుండా.. జనసత్వాలు కోల్పోయిన పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చారు. బీఆర్ఎస్ సర్కార్నే గద్దె దించి కాంగ్రెస్ను గద్దెనెక్కించారు. ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ లభించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. నిజానికి రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే 60 స్థానాల్లో గెలిస్తే సరిపోతుంది. కానీ కాంగ్రెస్ ఇంకా 4 స్థానాలు ఎక్కువగానే గెలుచుకుంది. అదే సమయంలో బీఆర్ఎస్ 39 స్థానాల్లో గెలుపొందగా.. బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ ఒక స్థానంలో గెలుపొందాయి. అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్ గెలుచుకోవడంతో.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం అయింది.
అయితే ఫలితాలు వెలువడినప్పటి నుంచి సీఎం అభ్యర్థి ఎవరన్న దానిపై అధిష్టానం కసరత్తు చేస్తోంది. అయితే సీఎం కుర్చీ కోసం కొందరు సీనియర్లు పోటీ పడినప్పటికీ.. ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డి పేరే గట్టిగా వినిపించింది. పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చిన రేవంత్ రెడ్డికే సీఎం పదవి ఇవ్వాలని కొందరు నేతలతో పాటు.. కార్యకర్తలు కూడా పట్టుబట్టారు. అటు సీఎం అభ్యర్థి ఎంపికపై సోమవారం సీఎల్పీ మీటింగ్ జరిగింది. అయితే నేతలందరూ సీఎల్పీ నేత ఎంపిక విషయం పూర్తిగా అధిష్టానానికే అప్పగిస్తూ తీర్మానం చేశారు. అంతేకాకుండా ఏఐసీసీ అబ్జర్వర్ డీకే శివకుమార్.. ఎమ్మెల్యేలతో పర్సనల్గా మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరించారు. నివేదికను అధిష్టానానికి పంపించారు.
అధిష్టానం రేవంత్ రెడ్డికి సీఎం పదవి కట్టబెట్టేందుకు మొగ్గుచూపింది. అదే రోజు రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం కూడా ఉంటుందని జోరుగా ప్రచారం కూడా జరిగింది. అయితే కొందరు సీనియర్ నేతలు మాత్రం అధిష్టానం నిర్ణయంతో ఏకీభవించలేదు. అదే రోజు సీఎం రేసులో ఉన్న సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. అధిష్టానంతో మంతనాలు జరిపారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఏసీసీ అబ్జర్వర్ డీకే శివకుమార్ వారితో సమావేశమై.. వారి డిమాండ్లపై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చారు. రేవంత్ రెడ్డిని తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ఫైనల్ చేశారు. చివరికి రేంత్ రెడ్డి కృషికి తగిన ఫలితం దక్కింది. తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY