అధికారంలో ఉన్న పార్టీ యాక్టివ్ కావడం సాధారణమే. మెజార్టీ రాజకీయ నాయకులు కూడా అధికారంలో ఉన్న పార్టీ వెంటే నడవాలని భావిస్తారు. అలాగే అధికార పార్టీ కూడా క్షేత్రస్థాయి నుంచీ బలం పెంచుకునే ప్రయత్నాలు మొదలుపెడుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆ తరహా రాజకీయాలే మొదలవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కాగానే.. ఆశించిన స్థాయిలో ఏ పార్టీకి సీట్లు రాకపోవడంతో ఎమ్మెల్యేల ఫిరాయింపులు ఉంటాయని చాలా మంది భావించారు. అయితే, ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీల్లో ఆ దిశగా రాజకీయాలు స్టార్ట్ కాలేదు. అయితే.. మునిసిపాల్టీల్లో మాత్రం నేతలు రూటు మారుతున్నారు. కొందరు బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ అవుతున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఉండగా.. చాలా చోట్ల కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే ఆర్మూరు, నల్లగొండ, మంచిర్యాల మునిసిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. సూర్యాపేట మునిసిపాలిటీలోనూ చైర్మన్, వైస్ చైర్మన్ పోకడలను వ్యతిరేకిస్తూ మెజారిటీ సభ్యులు అవిశ్వాస నోటీసులు ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 142 మునిసిపాలిటీల్లో ఈ నెలాఖరుకు నాలుగేళ్ల పాలన పూర్తవుతోంది. ఇప్పటికే 29 మునిసిపాలిటీల్లో అసమ్మతి వర్గం అవిశ్వాస నోటీసులు అందజేసింది. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన గత ప్రభుత్వం నాలుగేళ్ల వరకు అవిశ్వాస నోటీసులు ఇవ్వకుండా కట్టడి చేసేందుకు మునిసిపల్ చట్టసవరణ చేసి గవర్నర్ కు పంపింది. అయితే ఆ చట్టం రాజభవన్ గడప నుంచి బయటికిరాలేదు. జనవరి నెలాఖరుకు అన్నీ మునిసిపాలిటీలలో నాలుగేళ్ల పాలన ముగుస్తోంది. చైర్మన్లు, వైస్ చైర్మన్లపై చాలా చోట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న కౌన్సిలర్లు అవిశ్వాస నోటీసులు ఇస్తున్నారు. ఇప్పటికే ఆర్మూరు, నల్లగొండ మునిసిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని మునిసిపాలిటీల్లో అసంతృప్త కౌన్సిలర్లు అవిశ్వాస నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పుర రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. చాలాచోట్ల అసంతృప్తులను బుజ్జగించేందుకు బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. మెజారిటీ కౌన్సిలర్లు అధికార కాంగ్రెస్ వైపు మొగ్గుచూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మూడేళ్లుగా అభివృద్ధి పనుల్లో తమను భాగస్వాములను చేయలేదని బీఆర్ఎస్ కౌన్సిలర్లు అసమ్మతితో రగిలిపోతున్నారు. బెల్లంపల్లి మునిసిపాలిటీలో మొత్తం 34 వార్డులు ఉండగా బీఆర్ఎస్ నుంచి 22 మంది, కాంగ్రెస్ తరఫున 12 మంది గెలిచారు. బెల్లంపల్లి ఎమ్మెల్యేగా గడ్డం వినోద్ గెలవడంతో అవిశ్వాసం ముప్పు తప్పించుకునేందుకు బీఆర్ఎస్కు చెందిన చైర్పర్సన్ జక్కుల శ్వేత కాంగ్రెస్లో చేరారు.
చైర్పర్సన్ ఒంటరిగా వెళ్లడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆమెపై అవిశ్వాసం పెట్టేందుకు కలెక్టర్కు నోటీసు ఇచ్చారు. రెండు పార్టీల కౌన్సిలర్లు వేర్వేరుగా క్యాంపునకు వెళ్లారు. అవిశ్వాస తీర్మానానికి కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సమావేశానికి ఒకరోజు ముందు బీఆర్ఎస్కు చెందిన 18 మంది కౌన్సిలర్లు రాజీనామా చేశారు. కాగా, చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతన్పల్లి మునిసిపాలిటీకి చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాసం ప్రవేశపెట్టేందుకు కలెక్టర్కు నోటీసు అందజేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మునిసిపాలిటీ చైర్పర్సన్ అంగోతు అరుణ, వైస్ చైర్మన్ కోమండ్ల ఎలేందర్రెడ్డిపై తొమ్మిది మంది కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించారు. గురువారం కౌన్సిలర్లు కలెక్టరేట్కు చేరుకోగా కలెక్టర్ ప్రావీణ్య అందుబాటులో లేకపోవడంతో వరంగల్ ఆర్డీవో వాసుచంద్రకు అవిశ్వాసం నోటీసులను అందజేశారు. మంచిర్యాల మునిసిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గింది.
గ్రేటర్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా మున్సిపాలిటీల్లోనూ అవిశ్వాస నోటీసులు పెరుగుతున్నాయి. గత సర్కార్ హయాంలో ఇబ్బందులు పడిన వారంతా ఏకమై అవిశ్వాసాలను తెరపైకి తెస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ, స్వతంత్ర సభ్యులంతా కలిసి బల నిరూపణ కోసం సవాల్ విసురుతున్నారు. చెర్మన్లు, చైర్పర్సన్లపై అసంతృప్తి, ఎమ్మెల్యేలతో విభేదాలు, వ్యక్తిగత కారణాలు లాంటి ఎన్నో అంశాలు ఇందుకు కారణమవుతున్నాయి. ఇప్పటికే మూడు చోట్ల అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. మరో రెండుచోట్ల నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పదవీ కాలం మరో ఏడాది మాత్రమే ఉన్నప్పటీకీ.. అవిశ్వాస తీర్మానాల జోరు తగ్గడం లేదు. ఇప్పటికే ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్పై కౌన్సిలర్లు ఆవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 24మంది కౌన్సిలర్లకు గాను చైర్పర్సన్ కప్పరి స్రవంతి (కాంగ్రెస్)పై 15 మంది, బీఆర్ఎస్ ఇద్దరు, బీజేపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రతిపై సంతకాలు చేసి ఈ నెల 8న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. అలాగే ఆదిభట్ల మున్సిపాలిటీలో చైర్పర్సన్ కొత్త ఆర్థిక (కాంగ్రెస్), వైస్ చైర్మన్ కోరె కమలమ్మ (బీఆర్ఎస్)లపై తోటి కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యులతో పాటు బీజేపీ సభ్యుడు ఒకరు అవిశ్వాస తీర్మానం ప్రతిపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు సంతకాలు చేసి జిల్లా అదనపు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్కు నోటీసు అందించారు. అబ్ధుల్లాపూర్మెట్ మండలం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ (కాంగ్రెస్), వైస్ చైర్మన్ గుండ్లపల్లి హరిత (బీర్ఆర్ఎస్)పై అవిశ్వాసం దిశగా అడుగులు వేస్తున్నారు. షాద్నగర్ మున్సిపాలిటీ చెర్మన్పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కౌన్సిలర్లు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. తాజాగా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సీటుకు ఎసరు పెట్టారు. మేయర్ బుర్ర మహేందర్గౌడ్పై అవిశ్వాస తీర్మానానికి సభ్యులు ఎత్తుగడలు వేస్తున్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంకను కలిసిన 16మంది కార్పొరేటర్లు మేయర్పై అవిశ్వాస తీర్మానం పత్రాన్ని సమర్పించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE