తెలంగాణ రాష్ట్రంలో గత ఏడేళ్లలో పంటల సాగు గణనీయంగా పెరిగిందని, ఈ నేపథ్యంలో పంటల ప్రణాళిక ప్రకారం తెలంగాణకు యూరియా సరఫరా చేయాలని ఇఫ్కో ప్రతినిధులను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోరారు. గురువారం నాడు బంజారాహిల్స్ మంత్రుల నివాస సముదాయంలో ఇఫ్కో ప్రతినిధులతో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమావేశమయ్యారు. ఇఫ్కో మార్కెటింగ్ డైరెక్టర్ యోగేంద్ర కుమార్, జీఎం జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ మార్కెటింగ్ మేనేజర్ కృపా శంకర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానానికి చేరింది:
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సాగునీటి సరఫరా, రైతుబంధు, రైతుభీమా, ఉచితంగా 24 గంటల కరంటు సరఫరా మూలంగా వ్యవసాయం మీద రాష్ట్రంలో రైతులకు నమ్మకం కుదిరిందని, వ్యవసాయం దండగ అనే పరిస్థితి నుండి పండుగ అనే పరిస్థితికి వచ్చిందని చెప్పారు. “ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలతో ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలో రెండో స్థానానికి చేరింది. రైతుల ఆత్మహత్యలు తగ్గి ఆత్మవిశ్వాసంతో వ్యవసాయం చేస్తున్నారు. తెలంగాణలో పంటల సాగుకు అనుగుణంగా ఎరువులు సరఫరా చేయాలి. తెలంగాణలో నానో యూరియా ప్లాంట్ ఏర్పాటు కోసం ఇఫ్కో సమావేశంలో చర్చించాలి. దక్షిణ తెలంగాణలో నానో యూరియా ప్లాంట్ ఏర్పాటుతో దక్షిణ భారతదేశం మొత్తానికి ప్లాంటు అందుబాటులో ఉంటుంది” అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ