ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధితో పాటు అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర క్రీడాకారులను తీర్చిదిద్దేలా క్రీడా పాలసీ ఏర్పాటుపై చర్చించేందుకు కేబినెట్ సబ్ కమిటీ తొలిసారిగా భేటీ అయింది. హైదరాబాద్-రవీంద్రభారతిలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షత వహించగా మంత్రులు కేటిఆర్, ఎర్రబెల్లి దయాకరరావు, సబిత ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో ప్రస్తుత క్రీడారంగ పరిస్థితులపై క్రీడా శాఖ అధికారులను మంత్రులు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న క్రీడా మౌళిక సదుపాయాలు, అకాడమీలు, స్పోర్ట్స్ స్కూల్స్, స్టేడియంల పరిస్థితి, కోచ్ ల వివరాలు, క్రీడాకారుల వివరాలపై మంత్రులు పూర్తి వివరాలను సేకరించడం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రులు క్రీడా శాఖ అధికారులకు స్పోర్ట్స్ పాలసీ రూపకల్పనపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం గత 6 సంవత్సరాలలో ఐటీ, పారిశ్రామిక, వ్యవసాయ, పంచాయతీ రాజ్, విద్య, వైద్య, ఇరిగేషన్ రంగాలతో పాటు, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే అగ్రగామిగా, మోడల్ రాష్ట్రం గా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. అదేవిధంగా రాష్ట్రం క్రీడా రంగంలో కూడా దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దేలా క్రీడా పాలసీని ప్రవేశపెట్టారన్నారు. అందులో భాగంగా క్రీడా పాలసీని రూపొందించటానికి ప్రపంచంలో ఏ దేశంలో అత్యుత్తమ క్రీడా పాలసీ రూపొందించబడిందో క్రీడా శాఖ అధికారులు అధ్యయనం చేసి రాష్ట్రంలో అమలు పర్చాలని కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది.
ఈ కమిటీలో క్రీడా శాఖ మరియు ఇతర ప్రభుత్వ శాఖలైన విద్యా, పురపాలక మరియు గ్రామీణాభివృద్ధి శాఖల ప్రభుత్వ కార్యదర్శులందరితో త్వరలోనే ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంను క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించి క్రీడా మౌళిక సౌకర్యాలు, క్రీడాకారులకు అందిస్తున్న సౌకర్యాలపై సమగ్ర వివరాలను కేబినెట్ సబ్ కమిటీకి అందించాలని మంత్రులు ఆదేశించారు. వచ్చే కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ప్రముఖ క్రీడాకారులను, కోచ్ లను ఆహ్వానించి వారి అభిప్రాయాలను , సలహాలను స్వీకరించాలని మంత్రులు క్రీడా శాఖ అధికారులను ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu