తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోవటం లేదని ప్రకటించారు. బుధవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఎన్నికల్లో తాను పోటీ చేయనని, తన స్థానంలో సంగారెడ్డిలోని ఒక కాంగ్రెస్ కార్యకర్త పోటీ చేస్తారని తెలిపారు. ఒకవేళ పార్టీ శ్రేణులు దీనిని ఒప్పుకోకుంటే తన భార్య నిర్మలను పోటీ చేయిస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెల్లడించారు. అయితే 2028 ఎన్నికల్లో మాత్రం మళ్ళీ తానే పోటీ చేస్తానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇక ఈ సంచలన నిర్ణయం తీసుకోవడానికి కారణాలు మాత్రం ఆయన తెలుపలేదు.
కాగా గతకొంతకాలంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం తెలిసిందే. పార్టీలో సీనియర్లకు తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వడం లేదంటూ రేవంత్ రెడ్డిపై ఆయన పలు సందర్భాల్లో బహిరంగంగానే విమర్శలు చేశారు. ఈ క్రమంలో గత కొద్దిరోజులుగా ఆయన పార్టీ వ్యవహారాల్లో కూడా సరిగా పాల్గొనడం లేదు. ఇక ఈ పరిణామంలో ఆయన పరోక్షంగా పార్టీ నాయకత్వాన్ని ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయకపోయినా తాను చెప్పిన వ్యక్తికే సంగారెడ్డిలో కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలన్న సంకేతాలు జగ్గారెడ్డి ఇచ్చారని వివరిస్తున్నారు. అయితే జగ్గారెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఎవరూ ఇంతవరకు స్పందించలేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ