తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. తెలంగాణ ప్రభుత్వం పంపిన యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లుపై తనకు కొన్ని సందేహాలున్నాయని, విద్యాశాఖ మంత్రి వచ్చి వాటిపై వివరణ ఇవ్వాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ లేఖ రాయడం తెలిసిందే. అయితే గవర్నర్ తమిళిసై కావాలనే ప్రభుత్వ బిల్లులను తొక్కిపెడుతుని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆమెపై ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై రాజ్భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. తాను ప్రభుత్వం పంపిన బిల్లులను తొక్కి పెట్టాననడం సబబు కాదని, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాను ఎలాంటి బిల్లులను ఆపడం లేదని, ఒకదాని తర్వాత ఒకటి పరిశీలిస్తున్నాని, దీనికి కొంత సమయం పడుతుందని స్పష్టం చేశారు.
అసలు యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లు ఎందుకని, బోర్డు చెల్లుబాటుపై తమకు అనేక సందేహాలు ఉన్నాయని అన్నారు. బోర్డు నియామకాల్లో ఎలాంటి విధానాలు అనుసరిస్తారు? ఈ బోర్డు యూజీసీ నిబంధనలకు లోబడి ఉంటుందా? అలాగే ప్రతి ఏటా నియామకాలు ఉంటాయా? బోర్డు ఏర్పాటుకు ఎంత సమయం పడుతుంది? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకునేందుకు వీసీలతో సమావేశం నిర్వహించానని, అనేక వీసీ పోస్టులు చాలా కాలంగా ఖాళీగా ఉన్నాయని తన దృష్టికి వచ్చిందని, తాను పదేపదే ఈ అంశాన్ని లేవనెత్తిన తర్వాతే పోస్టులు భర్తీ చేశారని తెలిపారు. ప్రభుత్వ యూనివర్సిటీలో సరైన మౌలిక సదుపాయాలు లేని విషయాన్ని తన పర్యటనలో గుర్తించానని, విద్యార్థులు పడుకునే బెడ్లపై పరుపులు సరిగా లేవని తెలిపారు. కొన్నిచోట్ల రాత్రివేళ విద్యార్థులు చదువుకునేందుకు ట్యూబ్లైట్ సదుపాయం కూడా లేదని తన దృష్టికి వచ్చిందని, అలాగే ప్రభుత్వ మెస్ల పరిస్థితి మరీ దారుణంగా ఉందని వెల్లడించారు.
ఇక గవర్నర్ తమిళిసై తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వం తన ఫోన్ను ట్యాపింగ్ చేస్తున్నారని, ఇది ప్రభుత్వమే చేయిస్తోందనే సందేహం కలుగుతోందని ఆరోపించారు. అసలు తన ఫోన్ సమాచారం వారికెలా తెలుస్తుందని, మొయినాబాద్ ఫాంహౌస్ వద్ద వెలుగుచూసిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులోకి రాజ్భవన్ను లాగే ప్రయత్నం జరుగుతోందని, ఇది రాజ్యాంగ వ్యవస్థను అవమానపరచడమేనని గవర్నర్ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు తన వద్ద ఏడీసీగా పనిచేసిన తుషార్ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపానని, కానీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ పేరును బహిర్గతం చేసిందని గవర్నర్ మండిపడ్డారు. అయితే సీఎం కేసీఆర్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో తుషార్ అనే వ్యక్తిపై ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు నిందితులు తుషార్ పేరుని వాడారని, ఇతనికి బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయని ఆరోపించిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE