తెలుగు యూనివర్సిటీ మాజీ ఉపకులపతి, సాహితి వేత్త డాక్టర్.ఎల్లూరి శివారెడ్డిని దాశరథి కృష్ణమాచార్య అవార్డుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఎంపిక చేశారని రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను మంత్రి విడుదల చేసారు. 2021 సంవత్సరానికిగాను ఈ అవార్డుకు డా.ఎల్లూరి శివారెడ్డి ఎంపికయ్యారు. డా.ఎల్లూరి శివారెడ్డి ఉమ్మడి మహబుబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ కు చెందిన వారు. దాశరథి జయంతి సందర్భంగా ఎల్లూరి శివారెడ్డికి రేపు (జూలై 22,గురువారం) హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో అవార్డుతో పాటు రూ.1,01,116 నగదును మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందజేయనున్నారు.
సాహిత్య రంగంలో విశేషంగా కృషి చేసిన వారిని తెలంగాణ ప్రభుత్వం గుర్తించి, ప్రతి ఏడాది దాశరథి జయంతి (జులై 22) రోజున ఆ అవార్డును ప్రదానం చేస్తోంది. ఈ అవార్డు ప్రదానం 2015 సంవత్సరం నుంచి కొనసాగుతోంది. తెలుగు సాహిత్యంలో విశిష్ఠ స్థానం సంపాదించిన దాశరథి కృష్ణమాచార్య జూలై 22,1925న వరంగల్ జిల్లా గూడూరులో జన్మించారు. 2015లో తొలి దాశరథి సాహితీ పురస్కారాన్ని కవి ఆచార్య తిరుమల శ్రీనివాసాచార్యకు ప్రదానం చేశారు. 2016లో జే బాపురెడ్డికి, 2017లో ఆచార్య ఎన్ గోపికి, 2018లో వఝల శివకుమార్కు, 2019లో డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యకు, 2020లో డాక్టర్ తిరునగరి రామానుజయ్యకు దాశరథి కృష్ణమాచార్య అవార్డు వరించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ