తెలంగాణ రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు ముఖ్య గమనిక.. ఈ ఏడాది కూడా గతేడాది విధానంలోనే పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి విద్యాశాఖ చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. దీనిప్రకారం ఈ విద్యా సంవత్సరం కూడా 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లే నిర్వహించనున్నారు. కాగా గతేడాది కూడా ఈ మోడల్ లోనే పదో తరగతి పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా 2020-21 విద్యా సంవత్సరంలో తొలిసారిగా 6 పేపర్ల విధానానికి అధికారులు రూపకల్పన చేశారు.
ఆ ఏడాది కరోనా కారణంగా ఆలస్యంగా పాఠశాలలు తెరుచుకోకపోవడం, ఆన్లైన్లో క్లాసులు జరగడం, అందునా సరిగా క్లాసులు జరగకపోవడం, అనుకున్న సమయానికి సిలబస్ పూర్తికాకపోవడం.. తదితర కారణాలతో 2020-21 విద్యా సంవత్సరంలో అప్పటివరకు ఉన్న 11 పేపర్లను కుదించి కొత్తగా 6 పేపర్ల విధానాన్ని అమలు చేశారు. అయితే కరోనా విజృంభణ కారణంగా పరీక్షల నిర్వహణ సాధ్యం కాలేదు. అనంతరం 2021-22లో 6 పేపర్లతో పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో 2022-23 విద్యా సంవత్సరంలో కూడా మరోసారి ఈ విధానంలోనే పరీక్షలు జరపడానికి విద్యాశాఖ ప్రతిపాదించగా, ఈ ప్రతిపాదనను తెలంగాణ సర్కార్ ఆమోదించింది. కాగా గతంలో హిందీ సబ్జెక్ట్కు ఒక పేపర్, మిగిలిన తెలుగు, ఇంగ్లీష్, గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం సబ్జెక్టులకు రెండు పేపర్లు ఉండేవి. ఇప్పుడు ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో పేపర్ మాత్రమే ఉంటుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY