రాష్ట్రంలో కరోనా చికిత్సలో నిబంధనలు పాటించకుండా ఎక్కువుగా ఫీజులు వసూలుచేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం నాడు అసెంబ్లీలో ప్రకటించారు. ఫీజుల నియంత్రణపై ఐఏఎస్ అధికారులతో ఓ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు అధిక వసూళ్లపై పర్యవేక్షణ చేసేందుకు టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలోనే కరోనా చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రుల అందించే వివిధ సేవలకు వసూలు చేసే ఫీజులను నిర్ణయించామని చెప్పారు. అలాగే ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వం నిర్ణయించిన రేట్లను తమ ప్రాంగణంలోని ప్రముఖ ప్రదేశాలలో ప్రదర్శించాలని సూచించామని, వివిధ సేవలకు వసూలు చేసే ఫీజులు గురించి రోగి లేదా బంధువులకు వివరించాల్సిన బాధ్యత ప్రైవేట్ ఆసుపత్రులదేనని ఉత్తర్వుల ద్వారా పేర్కొన్నామని ప్రభుత్వం తెలిపింది. ప్రైవేట్ ఆస్పత్రులు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఫీజులు వసూలు చేయకపోవడం, నిబంధనలు పాటించకపోవడంపై ఎప్పటికప్పుడు ఫిర్యాదులు వస్తున్నాయని, కరోనా చికిత్స/భద్రతా ప్రోటోకాల్లు మొదలైన వాటికి కూడా కట్టుబడి ఉండకపోవడంపై కూడా ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 తో సహా వర్తించే చట్టాల నిబంధనల దృష్ట్యా ఈ విషయాన్ని ప్రభుత్వం పరిశీలించిన తరువాత, కరోనా చికిత్సలో ప్రైవేట్ ఆసుపత్రుల పనిని పర్యవేక్షించడానికి రాష్ట్ర స్థాయిలో టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఈ టాస్క్ఫోర్స్ లో ఐఏఎస్ అధికారులు రాహుల్ బోజ్జా, సర్ఫరాజ్ అహ్మద్, డి.దివ్య లను సభ్యులుగా నియమించారు. ప్రభుత్వం నిర్దేశించిన గరిష్ట రేట్లను ప్రైవేటు ఆసుపత్రులు పాటిస్తున్నాయా, కరోనా చికిత్స మరియు భద్రతా ప్రోటోకాల్లను ప్రైవేట్ ఆసుపత్రులు పాటిస్తున్నాయా అనే అంశాలను ఈ టాస్క్ఫోర్స్ ఇకపై పర్యవేక్షించనుంది. టాస్క్ ఫోర్స్ ఈ విషయంలో తమ నివేదికను ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించాలని, అలాగే టాస్క్ ఫోర్స్ కు సాంకేతిక సహాయాన్ని రాష్ట్ర ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu