తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త విమానాశ్రయాలపై దృష్టి సారించింది. రాష్ట్రంలో ప్రయాణికుల అవసరాల దృష్ట్యా వరంగల్, కొత్తగూడెం, నిజామాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో కొత్తగా విమానాశ్రయాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉడాన్ పధకం కింద, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహాయంతో వీటిని నిర్మించేందుకు కార్యాచరణ మొదలు పెట్టింది. ఎంచుకున్న ఈ ఆరు ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటుపై అధ్యయనం చేయడానికి ఎయిర్ పోర్ట్ అథారిటీ అఫ్ ఇండియాను రాష్ట్ర ప్రభుత్వం కన్సల్టెన్సీగా నియమించింది.
ఎయిర్ పోర్ట్ అథారిటీ అఫ్ ఇండియా అధికారులు ఈ ఆరు ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి అనువైన అంశాలు, ప్రతికూల అంశాలపై ఒక నివేదికను రూపొందించనున్నారు. సెప్టెంబర్ కల్లా ఈ నివేదికను సమర్పించనున్నట్టు సమాచారం, నివేదిక పరిశీలించిన అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక విధానాన్ని రూపొందించే అవకాశం ఉంది. అధ్యయనంలో భాగంగా అధికారుల బృందం గత నెలలో వరంగల్, కొత్తగూడెం, మహబూబ్ నగర్ లో ప్రతిపాదించిన ప్రాంతాలను పరిశీలించింది. మళ్ళీ ఈ నెల 19 నుంచి మూడురోజుల పాటు ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ లో ఏఏఐ అధికారులు పర్యటించనున్నారు.
[subscribe]
[youtube_video videoid=FsdIkr0XjGY]