తెలంగాణ ఎన్నికల్లో కీలక ఘట్టం ఈ రోజు మొదలైంది.. గెజిట్ నోటిఫికేషన్ విడుదలతో నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల్లోని రిటర్నింగ్ అధికారులు సైతం సంబంధిత నియోజకవర్గాలకు ఫారం–1 ద్వారా నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో పాటు ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించారు. నామినేషన్ల గడువు ముగిసే ఈనెల పదో తేదీ వరకు ప్రభుత్వ సెలవుదినాల్లో మినహా మిగతా అన్ని రోజుల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 13వ తేదీ వరకు అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 15 వరకు గడువుంది. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి అవుతాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు 94 రాజకీయ పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 2,644 నామినేషన్లు దాఖలు చేశారు. మరి ఈసారి ఎంత మంది ఎన్నికల బరిలో ఉంటారో చూడాలి. క నానిమేషన్లను దాఖలు చేసేటప్పుడు తమ నేరాల చిట్టాను స్పష్టంగా పేర్కొన్నాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.. నేరాలకు సంబంధించిన వివరాలను మూడు సార్లు ప్రముఖ వార్తా పత్రికల్లో, టీవీల్లో వెలువరించాలని పేర్కొంది. . ఒకవేళ అభ్యర్థి జైలులో ఉంటే అక్కడి అధికారుల ఎదుట ప్రమాణం చేసి, వారి ధ్రువీకరణతో పత్రాలు పంపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థిత్వం ఖరారైనప్పటి నుంచే చాలా మంది నామినేషన్లను సిద్ధం చేసుకోవడానికి అవసరైన ఏర్పాట్లు చేసుకున్నారు.
కాగా.. తొలిరోజు.. తొలి నామినేషన్ ఖమ్మంలో దాఖలైంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరావు ఉదయం 11 గంటలకే ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు. నిర్మల్ బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందించారు. నోటిఫికేషన్ విడుదలైన అరగంట లోపే రాష్ట్రంలో వీరిద్దరూ నామినేషన్ పత్రాలు అందించడం గమనార్హం. అలాగే.. కోదాడ నియోజకవర్గం నుంచి సుధీర్ కుమార్ జలగం అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా ఆన్లైన్లో తొలి నామినేషన్ వేశారు. ఇక అప్పటి నుంచీ ఎక్కడోచోట నామినేషన్ల పరంపర కొనసాగుతూనే ఉంది.
మరికొందరు నాయకులు నామినేషన్ వేసేందుకు శుభ ముహూర్తాల కోసం పండితులను సంప్రదిస్తున్నారు. బీ ఫామ్ అందుకోవడం మొదలుకొని నామినేషన్ పత్రాలపై సంతకం పెట్టే వరకు శుభ ఘడియలు చూసుకోవడం రివాజు. ప్రధాన పార్టీలన్నీ దాదాపు అభ్యర్థులను ప్రకటించడంతో నామినేషన్ దాఖలుకు తమ జన్మ నక్షత్రానికి సరిపడే శుభ ముహూర్తం ఖరారు చేసుకుంటున్నారు. కాగా.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నామినేషన్ పత్రాలతో రేపు సిద్దిపేట జిల్లాకు వెళ్లనున్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయపల్లి గ్రామంలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తన నామినేషన్ పత్రాలను స్వామి పాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహించనున్నారు. ప్రతి ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయడానికి ముందు కేసీఆర్ అక్కడకు వెళ్లి నామినేషన్ పత్రాలను స్వామివారికి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నామినేషన్ వేయడం సెంటిమెంట్గా పాటిస్తున్నారు. ఈ నెల 9న గజ్వేల్, కామారెడ్డిలలో కేసీఆర్ నామినేషన్లు వేయనున్నారు. నామినేషన్ల అనంతరం తెలంగాణ ఎన్నికల పోరు ఇక మరింత హోరెత్తనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE