హైదరాబాద్ రాజేంద్రనగర్ లోనిఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మూడు రోజుల పాటుగా జరిగే అగ్రిటెక్ సౌత్-2022 సదస్సులో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వ్యవసాయమే ఈ దేశ భవిష్యత్ అని, తెలంగాణ దానికి దిక్సూచి అని అన్నారు. తెలంగాణ ఏర్పడిన ఎనిమిదేళ్లలో అనేక విజయాలు సాధించామని, ఇంకా సాధించాల్సి ఉందన్నారు. “కోటి ఎకరాలను సస్యశ్యామలం చేసే సాగునీటి ప్రాజెక్టులను నిర్మించుకున్నాం. వ్యవసాయానికి అవసరమైన రైతుబంధు, ఉచితంగా 24 గంటల కరంటు దేశంలో ఎక్కడా లేనివిధంగా అందించడం జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతుభీమా పథకం అమలుచేసుకుంటున్నాం. తెలంగాణ జీఎస్డీపీలో వ్యవసాయరంగ వాటా 21 శాతంగా ఉంది” అని మంత్రి తెలిపారు.
తెలంగాణ రైతులు నేడు దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగారు:
“పల్లెలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రాలు బాగుంటేనే దేశాలు బాగుంటాయి, రాష్ట్రాల సమాహారమే దేశం. రాష్ట్రాలు స్వయంసమృద్ది సాధించడానికి దేశాన్ని పాలించే పాలకులు ఏ విధంగా ఆలోచించాలి. ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణ, కర్ణాటకలో చిన్న మొత్తం మినహా దేశంలో ఎక్కడా 5 లేదా పది లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులు కట్టలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు ఉండడం మూలంగా తెలంగాణలో కోటి ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టులు నిర్మించారు. ఒకప్పుడు కంట్రోలు బియ్యం కోసం ఎదురుచూసిన తెలంగాణ రైతులు నేడు దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగారు. నేడు కేంద్రప్రభుత్వం తెలంగాణ వరి ధాన్యం కొనుగోలు చేయలేమని చేతులెత్తేసే స్థాయికి చేరుకున్నాం. తెలంగాణ నుండి వస్తున్న ఉత్పత్తులను ఎలా వాడుకోవాలి అన్న ఆలోచన, ముందుచూపు కేంద్రానికి ఉండాలి. మేము కొనం, మీరు సాగు చేయవద్దు అని చెప్పడం గొప్పతనం కాదు. ఉత్పత్తులను ఉపయోగించుకునే దార్శనికత ఉండాలి. ప్రజల మానసిక, శారీరక శ్రమను వినియోగించుకునే దారులు వెతకడం పాలకుల విధి. ప్రజలను ఖాళీగా ఉంచడమంత ప్రమాదకరం ఇంకొకటి ఉండదు” అని మంత్రి పేర్కొన్నారు.
తక్కువ పెట్టుబడి,మానవశ్రమతో అధిక రాబడి, లాభాలు సాధించడంపై పరిశోధకులు దృష్టి సారించాలి:
సుప్రసిద్ధ శాస్త్రవేత్త స్వామినాధన్ మాట్లాడుతూ వ్యవసాయం అనేది సరైన దారిలో లేకపోతే ఈ దేశంలోని ఇతర ఏ రంగం కూడా సరైన దారిలో ఉంటాయని మనం ఆశించలేము అన్నారని చెప్పారు. 58-60 శాతం జనాభా ఆధారపడ్డ ఈ వ్యవసాయ రంగం మీద దేశంలో పెట్టవలసినంత దృష్టి పెట్టలేదు. రోదసి మీదకు వెళ్లే శాస్త్ర సాంకేతిక విజ్ఞానం కలిగిన మన దేశంలో ఈ రోజు సమాజంలో జరుగుతున్న చర్చ మనుషులను విభజించి, సమాజాన్ని విడదీసేలా చర్చ జరుగడం దురదృష్టకరం. ఇది కొత్త తరానికి, దేశ భవిష్యత్ కు ఒక శాపం. దేశంలోని వనరులను సద్వినియోగం చేసుకుని భవిష్యత్ కు బాటలు వేసే చర్యలు మాని గతాన్ని తవ్వి గందరగోళం రేపుతున్నారు. ఏ స్థాయి ఆలోచనలు చేయవలసిన చోట ఎలాంటి వారు ఉన్నారు గమనించవలసిన అవసరం ఉంది. వాళ్లు సరిగ్గా నడిపిస్తే ఈ రంగం ఇలా ఉండేదా ఆలోచించాలి. పెరిగిన శాస్త్ర సాంకేతికత రైతుల వద్దకు చేరేలా చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్య అధిక పెట్టుబడి, తక్కువ పెట్టుబడి, తక్కువ మానవ శ్రమతో ఎక్కువ పని జరిగేలా చూడడం, అధిక రాబడి, అధికలాభాలు సాధించడం మీద పరిశోధకులు దృష్టి సారించాలి. ఈ నేపథ్యంలో మారుతున్న ఆహారపు అలవాట్లను దృష్టిలో పెట్టుకోవాలి. మంచిని మంచి అని ప్రశంసించలేని రాజకీయ వ్యవస్థ మన దేశంలో తయారయిందని మంత్రి అన్నారు.
కొత్తతరం వ్యవసాయరంగం మీద పెద్ద ఎత్తున దృష్టిసారించాలి:
“ఎనిమిది విడతలలో రూ.50 వేల కోట్లు రైతుబంధు వంటి గొప్ప పథకం ద్వారా రైతుల ఖాతాలలోకి చేరినా ఇది ఒక మంచి పథకం అని చెప్పే ఒక్క రాజకీయ పార్టీ లేకపోవడం గమనార్హం. వ్యవసాయాన్ని మించి ఉపాధి కల్పించే రంగం ఈ దేశంలో ఇంకొకటి లేదు. అమెరికా తర్వాత అత్యధిక సాగుభూమి ఉన్న దేశం భారత్. కొత్తతరం వ్యవసాయరంగం మీద పెద్ద ఎత్తున దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ఉపాధినిచ్చే రంగం వైపు యువత దృష్టి సారించకుండా ప్రభుత్వ ఉద్యోగం పేరుతో ఎండమావుల వైపు పరిగెత్తిస్తున్నారు. వ్యవసాయంతో పాటు వ్యవసాయం చుట్టు అల్లుకున్న అనుబంధ పరిశ్రమలు, సాంకేతికతలో విస్తృతమయిన ఉపాధి అవకాశాలు ఉన్నాయి. సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి జీవం పోశారు. దేశానికి తెలంగాణ కొత్త దారి చూపుతున్నది. రైతుబంధు ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన 20 పథకాల్లో ఒకటి అని యూఎన్ఓ ప్రశంసించింది. తాగునీరు లేకున్నా ఉన్న వనరులతో అరబ్ దేశాలు అత్యున్నత స్థాయికి ఎదిగాయి. అత్యంత అధునాతన ఉత్పత్తులు మొదట దుబాయిలో తేలుతాయి. గడియారాల తయారీతో స్విట్జర్లాండ్, అధునాతన కార్ల తయారీతో జర్మనీ ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. 70 వేల టీఎంసీల నీళ్లు, 40 కోట్ల ఎకరాల సాగుభూమి, 140 కోట్ల జనాభా ఉన్న భారత్ ఇంకా తన పౌరులకు నాణ్యమైన ఆహారం అందించలేకపోతున్నది. మన విధానాలు ? మన ఆవిష్కరణలు ఏమయ్యాయి?, వీటి మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కొత్తతరం వ్యవసాయరంగా మీద దృష్టిసారించి ప్రపంచానికి నాణ్యమైన ఆహారం అందించే స్థితికి భారతదేశం చేరుకోవాలి. ఈ సదస్సు దానికి బాటలు వేస్తుందని ఆశిస్తున్నాను” అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ