తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్ లో పెరిగిన చేరికలు.. ఇప్పుడు అధికార పార్టీ వైపు టర్న్ తీసుకుంటున్నాయి. బీఆర్ ఎస్ తో నువ్వా.. నేనా అనే స్థాయిలో పోరాడుతున్న కాంగ్రెస్ ను అంతర్గత కల్లోలం కలవరపెడుతోంది. ఇంకా టికెట్ల పంపిణీ పూర్తి కాకముందే తిరుగుబాట్లు తీవ్రమవుతున్నాయి. పార్టీ నేతల్లో ఆగ్రహావేశాలు ఆకాశాన్నంటాయి. ఏకంగా పార్టీ రాష్ట్రకార్యాలయం గాంధీభవన్పై రాళ్ల దాడులకు పూనుకుంటున్నారు. పార్టీ జెండాలను దగ్దం చేస్తున్నారు. ఇక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అయితే.. తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తోంది. అసంతృప్తులు ఆయన దిష్టిబొమ్మను దహనం చేస్తున్నారు. తగిన బుద్ధి చెబుతామంటూ సవాళ్లు విసురుతున్నారు.
టిక్కెట్లు ఆశించిన పలువురు తమకవి దక్కకపోవడంతో తిరుగుబాటుకు రెడీ అయ్యారు. రెబెల్స్గా పోటీ చేసేందుకు కొందరు సిద్ధపడగా, పోటీ చేయకపోయినా తమకు రావాల్సిన టిక్కెట్ను ఎగరేసుకుపోయిన కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొడతామంటూ బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఒకరా ఇద్దరా అలాంటి వారు పదుల సంఖ్యలో ఉన్నారు. పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సైతం వీరిలో ఉన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి తనకు నాగర్కర్నూల్ టిక్కెట్ రాకపోవడంతో కాంగ్రెస్కు రాజీనామా చేశారు. త్వరలో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్నట్లు ప్రకటించారు. జడ్చర్ల టిక్కెట్ను ఆశించిన అదే జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యం ఇప్పటికే బీఆర్ఎస్లో చేరి పోయారు. అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి పి.చంద్రశేఖర్ సైతం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. జూబ్లీహిల్స్ టిక్కెట్ దక్కకపోవడంతో మాజీ ఎమ్మెల్యే , పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్రెడ్డి కేసీఆర్ను కలిశారు. బీఆర్ఎస్లో చేరడం ఇక లాంఛనమే. కూకట్పల్లి టిక్కెట్నాశించిన గొట్టిముక్కల వెంగళరావు బీఆర్ఎస్ ఇంటి బాట పట్టారు. ఇలా పలువురు నేతలు బీఆర్ఎస్ దారికి వస్తున్నారు.
మరోవైపు తమ సత్తా ఏమిటో చూపిస్తామంటూ రెబెల్స్గా రంగంలోకి దిగేందుకు సైతం పలువురు సిద్ధమవుతున్నారు. అలాంటి వారిలో చల్లమల్ల కృష్ణారెడ్డి (మునుగోడు), ఎ.ప్రవీణ్రెడ్డి(హుస్నాబాద్), జంగా రాఘవరెడ్డి(వరంగల్ వెస్ట్), ఎం.సరస్వతి (ఆసిఫాబాద్),గాలి అనిల్కుమార్(నర్సాపూర్), ఇ.వెంకట్రామ్రెడ్డి(పరకాల), జక్కిడి ప్రభాకర్రెడ్డి(ఎల్బీనగర్), తదితరులున్నారు. ఇలా బీఆర్ఎస్లో చేరేవారు, పోటీగా రెబెల్స్గా బరిలో దిగేవారి సంఖ్య క్రమేపీ పెరిగిపోతోంది. ఇవన్నీ.. బీఆర్ ఎస్ కు కలిసి వస్తున్నాయి. కీలక నేతలను ఇటువైపు తిప్పుకుని పోటీ పార్టీ అయిన కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు అధికార పార్టీ నాయకులు ప్రణాళికలు రచిస్తున్నారు. మరి.. దీనికి తగ్గట్టుగా కాంగ్రెస్ మేలుకుని అసంతృప్తులను దారికి తెచ్చుకోకపోతే మరిన్ని కష్టాలు తప్పవనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ