కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నేతృత్వంలో తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి, కృష్ణా నది జలాల వినియోగానికి సంబంధించిన వివాదాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రోజు అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులతో కలిసి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మీడియాతో మాట్లాడుతూ భేటీలో చర్చించిన అంశాలను వెల్లడించారు.
“రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 2014లో అపెక్స్ కౌన్సిల్ ఏర్పడింది. 2016 తర్వాత రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. కృష్ణా, గోదావరీ నదుల నీటి పంపకం, వివాదాల పరిష్కారం కోసం అపెక్స్ కౌన్సిల్ బాధ్యతగా ఉంది. సమావేశం చాలా సుహృద్భావ వాతావరణంలో జరిగింది. అన్ని సమస్యల పరిష్కారం కోసం చర్చించాము. ఇద్దరు ముఖ్య మంత్రులు సమస్యల పరిష్కారానికి సిద్దంగా వున్నారు” అని కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధులు నిర్ణయించడం, కృష్ణా గోదావరి నదులపై తలపెట్టిన ప్రాజెక్టుల డీపీఆర్ సమర్పించడం, నీటి పంపకాల కోసం లోప భూయిష్ఠ విధానం ఏర్పాటు, కృష్ణా బోర్డ్ ఏపీకి తరలించడం వంటి అంశాలను అజెండాగా పెట్టుకుని చర్చించినట్లు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి వెల్లడించారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని నోటిఫై చేయాలని నిర్ణయించారు. ఈ అంశంపై కేంద్రానికి అధికారం ఉంటుందని, నోటిఫై చేస్తామని అన్నారు. కొత్త ప్రాజెక్టుల డీపీఆర్ లు సమర్పించేందుకు ఇద్దరు సిఎంలు అంగీకరించినట్టు తెలిపారు. కృష్ణా నీటి పంపకాలను ట్రిబ్యునల్ కు రిఫర్ చేయాలని నిర్ణయం, అందుకు అడ్డుగా ఉన్న సుప్రీంకోర్టులోని కేసు ఉపసంహరించుకునేందుకు తెలంగాణ అంగీకరించిందని అన్నారు. తెలంగాణ అభ్యంతరాలపై కేసు ఉపసంహరించుకున్నాక న్యాయ పరిశీలన చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు.
గోదావరి నదిపై ట్రిబ్యునల్ ఏర్పాటు. ఇరు రాష్ట్రాల నుంచి వినతులు వచ్చిన తర్వాత ఒక సంవత్సరంలోగా ఏర్పాటు చేస్తామని అన్నారు. కృష్ణా నది యాజమాన్య బోర్డు ఏపీకి తరలింపు నిర్ణయం జరిగింది. అందుకు ఇరువురు సీఎంలు అంగీకరించారు. కృష్ణా నదీ పంపకాలు ప్రాజెక్టుల వారీగా జరగాలన్న డిమాండుపై సంబంధిత ట్రిబ్యునల్ నిర్ణయిస్తుంది. అందుకు అవసరమైన న్యాయ సలహా తీసుకుంటామని అన్నారు. అలాగే శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల నిర్వహణ సంబంధిత బోర్డులు ద్వారా మాత్రమే జరుగుతుందని కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu