కొత్త ప్రభుత్వం ఏర్పడి 30 రోజులు కూడా గడవక ముందే.. అధికార, విపక్ష సభ్యుల వాదోపవాదాలు, తిట్ల దండకాలు 420 వరకూ వెళ్లిపోయాయి. ఇంకా పాలన పూర్తి స్థాయిలో మొదలు కాకుండానే, సంక్షేమ పథకాలపై స్పష్టత లేకుండానే, పూర్తి స్థాయిలో విధి విధానాలు ఖరారు కాకుండానే.. కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారంటీలు కాదంటూ, కాంగ్రెస్ 420 హామీల పేరుతో ప్రతిపక్ష బీఆర్ఎస్ బుక్ లెట్ విడుదల చేయడంపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. దీనిపై సామాజిక మాధ్యమాల్లోనూ విపరీతమైన కామెంట్లు వినిపిస్తున్నాయి. కొత్త ప్రభుత్వానికి తొలుత ఆరు నెలల సమయం ఇస్తామని, కొద్ది రోజులకు మూడు నెలలు చూస్తామని చెప్పిన ప్రతిపక్ష పార్టీ 30 రోజులు కూడా ఓపిక పట్టలేకపోవడం చూస్తుంటే.. అధికారం కోల్పోయిన బాధ వారికి ఎంత ఉందో అర్థం అవుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అడ్డగోలు హామీలు ఇవీ.. అని బుక్ లెట్ తీసుకొచ్చిన బీఆర్ ఎస్.. ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ కూడా అలాంటి హామీలనే ఇచ్చిందనే విషయాన్ని మరచిపోవడం విడ్డూరమనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.
కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మెజార్టీ కారణాలు ఆరు గ్యారంటీలు కావడంతో బీఆర్ ఎస్ ఫోకస్ మొత్తం వాటిపైనే పెట్టింది. ఎన్నికల్లో గెలిచేందుకు మాత్రమే మోసపూరితంగా ఆచరణ సాధ్యం కాని హామీలు కాంగ్రెస్ ఇచ్చిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్.. హామీలు అమలను కాంగ్రెస్ పార్టీకి గుర్తుచేసేలా ఈ బుక్ లెట్ రిలీజ్ చేసింది. ముందుగానే డిసైడ్ అయ్యారో లేదో తెలియదు కానీ మోసానికి మారుపేరుగా నిలిచే 420 నంబర్ ఉండేలా కాంగ్రెస్ హామీలు ఉన్నాయని ఎద్దేవా చేస్తున్నారు. అధికారంలోకి వచ్చినరోజు నుంచే సాకులతో హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం వెనకడుగు వేస్తుందని ఆరోపించారు. ఏవో కొర్రీలు పెట్టి కొన్ని పథకాలకు లబ్ధిదారులను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ వేస్తోందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గుర్తుచేసేందుకు తాము కాంగ్రెస్ 420 హామీల పేరుతో బుక్ లెట్ తీసుకొచ్చామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.
అయితే ఈ వ్యాఖ్యలు, బుక్ లెట్ తరహా రాజకీయాలు కనీసం ఏడాదో, రెండేళ్లో దాటాక చేసి ఉంటే ప్రతిపక్ష పార్టీ ప్రజల తరఫున తన బాధ్యత నెరవేరుస్తుందన్న అభిప్రాయం ఎక్కువ మందిలో ఉండేది. 30 రోజులు కూడా దాటకుండానే ఏకంగా 420 అంటూ, పథకాల అమలుకు కాంగ్రెస్ వెనుకడుగు వేస్తోందంటూ కేటీఆర్ లాంటి వ్యక్తులు ఆరోపించడంపై, అప్పుడే ఈ తరహా రాజకీయాలు చేయడంపై సాధారణ ప్రజల్లో కూడా భిన్నాప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆరు గ్యారంటీలు, వ్యవసాయ రంగం, విద్యా రంగం, యువత, అమరులు, సాగునీటి రంగం, మైనారిటీ, బీసీలు, మహిళా సంక్షేమం, విద్యా వైద్య రంగాలు, ఉద్యోగుల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, హైదరాబాద్ అభివృద్ధి, పర్యాటక రంగం, పర్యావరణం, గృహ నిర్మాణానికి సంబంధించి కాంగ్రెస్ ఇచ్చినవి 420 హామీలు అంటూనే వాటిని నెరవేర్చాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తుండడం విడ్డూరంగా మారింది.
ఈ నేపథ్యంలోనే.. వాళ్లు 3, 500 రోజులు పాలించారు.. మేం వచ్చి 35 రోజులు కూడా కాకుండానే అప్పుడే విమర్శలా అంటూ మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ పై మండిపడడంలో తప్పేం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీఆర్ ఎస్ బుక్లెట్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అయితే తీవ్రస్థాయిలోనే స్పందించారు. నంబర్ వన్ 420 కేసీఆర్ అని, కేటీఆర్ మోసగాడు అని వ్యాఖ్యానించారు. దళితుడిని సీఎం చేస్తామని, దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. నెల రోజుల్లోనే హామీలను అమలు చేయలేదని.. కాంగ్రెస్ 420 అని కేటీఆర్ వ్యాఖ్యానించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. బీఆర్ఎస్ ఇచ్చిన హమీలను ఒకసారి నెమరువేసుకోవాలని కేటీఆర్కు సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని చెప్పారు. ఇచ్చిన హమీలను నెరవేర్చడానికి మూడు వారాలలోనే ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నామన్నారు.
ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే అధికార, విపక్ష సభ్యులు ఈ స్థాయిలో ఆరోపణలు, వాదోపవాదాలకు పాల్పడడంపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. మీరు 420 అంటే.. మీరే 420 అంటూ ఇరు పార్టీల కార్యకర్తలు కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. మున్ముందు రాజకీయాలు ఇంకెలా ఉంటాయోనని సామాన్య ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రానున్న లోక్ సభ సమరంలోనూ ఈ ఆరు గ్యారెంటీలు, 420 బుక్ లెట్ ప్రచార అస్త్రాలుగా మారే అవకాశం ఉన్నాయని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY