నిత్య నూతనంగా వెలుగొందుతూ, దేశంలోనే ప్రముఖ జంతు ప్రదర్శనశాలగా పేరుపొందిన హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ 59 ఏళ్లు పూర్తిచేసుకుని 60వ ఏట అడుగు పెట్టింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న 68వ వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా తెలంగాణ అటవీశాఖ నెహ్రూ జూ పార్క్ లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించింది. జూ పార్క్ లో కొత్తగా మూడు ఆకర్షణలు తోడయ్యాయి. దక్షిణాఫ్రికాలో కనిపించే ముంగిస జాతికి చెందిన మీర్ క్యాట్, దక్షిణ అమెరికా అడవుల్లో కనిపించే చిన్న కోతి జాతికి చెందిన మార్మో సెట్ ఎంక్లోజర్లను గురువారం తెలంగాణ రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి మరియు హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఆర్.ఎం.డోబ్రియాల్ ప్రారంభించారు. అలాగే వివిధ రకాలకు చెందిన చేపలతో కూడిన కొత్త ఓపెన్ ఫిష్ పాండ్ ను కూడా జూ పార్క్ లో ఆవిష్కరించారు.
కొన్నాళ్ల క్రితం జూలో జన్మించిన ఆసియాటిక్ సింహం (ఆడబిడ్డకు) కు అధికారులు ఇవాళ అదితి అని నామకరణం చేశారు. ఆ తర్వాత జూ పార్క్ లో జూడే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. గత ఏడాదికి చెందిన నెహ్రూ జూలాజికల్ పార్క్ వార్షిక నివేదికను క్యూరేటర్ రాజశేఖర్ చదివి వినిపించారు. ఇక 59 ఏళ్ళు పూర్తి చేసుకున్న నెహ్రూ జూపార్క్ 60వ ఏట అడుగుపెట్టిందని, వచ్చే ఏడాది ఈ డైమండ్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్ వెల్లడించారు. ఇక్కడ పనిచేస్తున్న జూ సిబ్బంది అంకిత భావం వలనే, సరైన నిర్వహణతో దేశంలోనే ప్రముఖ జూ పార్క్ గా ప్రశంసలు అందుకుంటోందని వెల్లడించారు. సందర్శకులు కూడా జంతువుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని, పిల్లలకు అడవులు, జంతువుల పట్ల ప్రేమ పెరిగేలా తల్లిదండ్రులు చూడాలన్నారు.
నెహ్రూ జూ పార్క్ క్రమంగా కరోనా ముందునాటి పరిస్థితులకు చేరుకుంటుందని సందర్శకుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో వారికి అవసరమైన సౌకర్యాలను అందించేందుకు జూ పార్కు కృషి చేస్తుందని జూ పార్క్ డైరెక్టర్, అదనపు పీసీసీఎఫ్ వినయ్ కుమార్ వెల్లడించారు. జూ పార్క్ నిర్వహణలో నిబద్ధతతో పాల్గొంటూ కార్యక్రమాలు సజావుగా నిర్వహిస్తున్న ఉద్యోగులకు కేవీఎస్ బాబు మెమోరియల్ అవార్డులను ఉన్నతాధికారుల చేతుల మీదుగా అందించారు. అలాగే జూలో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న పాఠశాల విద్యార్థులకు బహుమతులు ప్రధానం జరిగింది. జూ పార్క్ లో జంతువులను దత్తత తీసుకున్న సంస్థలు, వ్యక్తులు, జూ పార్కు నిర్వహణ కోసం విరాళాలు ఇచ్చిన సంస్థలు, వ్యక్తులను ఈ సందర్భంగా జూ యాజమాన్యం సత్కరించింది. ఈ కార్యక్రమంలో అటవీశాఖ ఓఎస్డీ శంకరన్, రిటైర్డ్ అటవీ అధికారులు బుచ్చి రామ్ రెడ్డి, నాగభూషణం, డిప్యూటీ క్యురేటర్ నాగమణి, ఇతర జూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY