అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించడానికి పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్న అన్ని పార్టీలు.. ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి అంతకుమించి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే అభ్యర్థుల గెలుపోటములను డిసైడ్ చేసే సత్తా యూత్ చేతిలోనే ఉండడంతో వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు నేతలంతా. తెలంగాణలో మెుత్తం 3.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సున్న ఓటర్లు 7 ఏడు లక్షల మంది ఉండగా, 19 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు గల ఓటర్లు 75 లక్షల మంది ఉన్నారు.
అందుకే యువతను గేలం వేయడానికి ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెబుతుండగా.. కేసీఆర్ ప్రభుత్వ గత వైఫల్యాలు అయిన టీఎస్పీపీఎస్సీ వంటి అంశాలను ప్రతిపక్షాలు తమ అస్త్రాలుగా మలచుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే యువత కోసం’యూత్ డిక్లరేషన్’ను ప్రకటించింది. దీనిలో తమ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే .. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పుకొచ్చింది.
ఇప్పుడున్న ఓటర్లలో 18 ఏళ్ల వయసు నుంచి 40 ఏళ్ల వయస్సు వారే ఎక్కువ మంది ఉన్నారు. వీరు ఎటువైపు మొగ్గు చూపిస్తే అటు వైపే విజయావకాశాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. కొత్త ఓటర్లు, యువతీ యువకులు, నిరుద్యోగులు ఇదే ఏజ్ గ్రూప్కు చెందిన వారు కావడంతో.. ప్రధాన పార్టీల అభ్యర్థులంతా ఈ ఎన్నికల్లో ఎక్కువ శాతం యువతను ఆకట్టుకునేలాగే ప్రసంగాలు చేస్తున్నారు. అంతేకాదు యువతతో ప్రత్యేకంగా సదస్సులు, సమావేశాలు నిర్వహించేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. అంతేకాదు యువతకు ఉపాధి కల్పించడానికి ఉద్యోగాలే కాకుండా.. పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తామని హామీలు గుప్పిస్తున్నారు.
అలాగే ఈ ఎన్నికలలో 40 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు ఓటర్లు దాదాపు 40 శాతం మంది వరకూ ఉన్నారు. వీరిలో ఎక్కువ శాతం మంది రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణులు ఉన్నారు. వీరిని తమ పార్టీవైపు ఆకట్టుకోవడానికి ఇప్పటికే ఆయా పార్టీల నేతలు తమ మేనిఫెస్టోలను ప్రకటించాయి. ఇంటి నిర్మాణం, గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించడం, రైతుబంధు సాయం పెంపు, బీమా సౌకర్యం వంటి హామీలు గుప్పిస్తున్నాయి.
బీజేపీ కూడా యువతను ఆకట్టుకోవడానికి ఇప్పటికే టెన్త్ పేపర్ లీక్, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటన విషయంలో ఆందోళనలు చేపట్టింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ద్వారానే యువతకు ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయని చెబుతూ వస్తోంది. దీనికి తోడు ఇటీవల జరిగిన జీ 20 సమ్మిట్, చంద్రయాన్-3 విజయవంతం కావటంపై యువతలో బీజేపీ ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడటంతో..దాననే తమ ఓట్లుగా మలుచుకోవాలని తెలంగాణ బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.మొత్తంగా తెలంగాణ రాజకీయాలు యూత్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నట్లే కనిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE