తెలంగాణ రాజకీయాల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ నేతలు పార్టీలు మారుతూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి.. ప్రచారాల్లో దూసుకెళ్తోంది. అటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మాత్రం ఇంకా అభ్యర్థుల ఎంపిక వద్దే ఆగిపోయాయి. క్యాండిడేట్లను సెలక్ట్ చేయడంలో తలామునకలవుతున్నాయి. మొన్నటి వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ ఎవరూ ఊహించని విధంగా పెరుగుతూ పోయింది. అయితే అభ్యర్థులను ప్రకటించడంలో కాంగ్రెస్ రోజురోజుకు ఆలస్యం చేస్తుండడంతో.. పెరిగిన గ్రాఫ్ కాస్త తగ్గడం మొదలయింది. సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్కు ఊహించని షాక్ తగిలింది.
కాంగ్రెస్లో కొద్దిరోజులుగా గందరగోళ పరిస్థితుల నెలకొన్నాయి. టికెట్ల కోసం నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈక్రమంలో టికెట్ రాదని భావించిన కొందరు అసంతృప్తులు ఇప్పటికే పార్టీని వీడారు. ఇప్పుడు సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కూడా కాంగ్రెస్కు గట్టి షాక్ ఇచ్చారు. ఎన్నికలకు ఇంకా యాభై రోజులు కూడా లేవు. సరిగ్గా ఈ సమయంలో కాంగ్రెస్కు పొన్నాల టాటా చెప్పేశారు. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీని వీడారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు పంపించారు. పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడం వల్లే తాను రాజీనామా చేస్తున్నట్లు పొన్నాల లేఖలో పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న పొన్నాల.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడ్డాక.. తొలి పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత తెలంగాణలో జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పొన్నాల ఓటమిని చవిచూశారు. 2018లో కాంగ్రెస్ టికెట్ కోసం పొన్నాల తీవ్రంగా శ్రమించారు. ముందుగా అతనికి టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం నిరాకరించింది. దీంతొ పొన్నాల ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతో ఫైట్ చేసి టికెట్ దక్కించుకున్నాడు. అయినప్పటికీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
ఈసారి ఎన్నికల్లో సీనియర్లను కొందరిని పక్కనపెట్టి.. యువతకు టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోందట. పాలిటిక్స్లో యాక్టివ్గా లేని కొందరు సీనియర్లను పక్కన పెట్టాలని చూస్తోందట. ఈక్రమంలొ పొన్నాలను కూడా పక్కన పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటు పోయినసారి ఢిల్లీకి పోయి కొట్లాడి టికెట్ దక్కించుకున్నప్పటికీ ఓటమి పాలయ్యారు. దీంతో ఈసారి ఢిల్లీకి వెళ్లి టికెట్ అడుక్కునే పరిస్థితి లేదు. ఈక్రమంలో తనకు టికెట్ రాదని భావించి పొన్నాల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే కాంగ్రెస్లో అసంతృప్తులుగా ఉన్న నేతలను ఆకర్షించే దిశగా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇప్పటికే కాంగ్రెస్లో అసంతృప్తిగా ఉన్న పలువురు నేతలను బీఆర్ఎస్ తమ గూటికి చేర్చుకుంది. ఈక్రమంలో పొన్నాల లక్ష్మయ్య కూడా బీఆర్ఎస్లో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్టానంతో పొన్నాల సంప్రదింపులు జరిపారట. అతి త్వరలో మంత్రి కేటీఆర్ సమక్షంలో పొన్నాల బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.
అయితే క్రమక్రమంగా కాంగ్రెస్ తిరిగి పుంజుకుంటున్న సమయంలో పొన్నాల రాజీనామా చేయడం పార్టీకి పెద్ద మైనస్ అని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అటు బీఆర్ఎస్లో పొన్నాల చేరబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారం కూడా కాంగ్రెస్కు పెద్ద మైనస్ అవుతుందని అంటున్నారు. మరి పొన్నాల రాజీనామాపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE