తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో సోమవారం రాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో 11 మంది మరణించారు. రాత్రి 8 గంటల సమయంలో ఆక్సిజన్ సరఫరాలో ప్రెజర్ తగ్గి 5 నిమిషాల పాటు అంతరాయం ఏర్పడిందని, అంతలోపే ఐసీయూలో 11 మంది ప్రాణాలు పోవడం దురదృష్టకరమని చిత్తూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ అన్నారు. వెంటనే డాక్టర్లు అప్రమత్తంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పారు. చెన్నై నుంచి రావాల్సిన ట్యాంకర్ ఆలస్యం కావడంతో బల్క్ సిలిండర్ సప్లై అందించామని చెప్పారు. అనంతరం ఆ ట్యాంకర్ చేరుకోవడంతో సరఫరాను పునరుద్ధరించి బాధితులకు ఆక్సిజన్ అందించినట్టు తెలిపారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విచారణకు ఆదేశించారని తెలిపారు.
మరోవైపు తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి పరిస్థితులకు దారి తీసిన కారణాలను గుర్తించి, మళ్లీ ఎక్కడా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల వద్ద ఆక్సిజన్ సరఫరా సహా ఇతర అన్ని అంశాలపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ