ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా 3 బిలియన్ డాలర్ల (రూ.21 వేల కోట్లకు పైగా) రుణం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) సంసిద్ధత వ్యక్తం చేసినట్టు ఏపీ ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 6, గురువారం నాడు సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఏఐఐబీ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ డి.జె.పాండియన్, ఇతర ఏఐఐబీ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపడుతున్న పలు సంక్షేమ కార్యక్రమాలను, వివిధ ప్రాజెక్టుల వివరాలను సీఎం వారికి వివరించారు. అలాగే ఇవ్వబోయే రుణాన్ని ప్రభుత్వం నిర్ణయించుకున్న ప్రాధాన్యతల ప్రకారం ఖర్చు చేసుకోవచ్చని ఏఐఐబీ పేర్కొన్నట్లుగా అధికారులు తెలిపారు.
రాష్ట్రంలోని పోర్టులు, సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, విమానాశ్రయాలు, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందిస్తామని ఏఐఐబీ వెల్లడించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా గోదావరి-కృష్ణా నదులు అనుసంధానానికి కూడా సాయం అందిస్తామని చెప్పినట్టు సమాచారం. ఏఐఐబీ ప్రధాన కార్యాలయానికి రావాల్సిందిగా సీఎం జగన్ను ఈ సందర్భంగా బ్యాంకు ప్రతినిధులు ఆహ్వానించారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
[subscribe]