ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి 14 నుండి ప్రారంభం కానున్నాయి. సవరించిన ప్రణాళిక ప్రకారం ఈ సమావేశాలు దాదాపు వారం రోజుల పాటు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. అయితే సభను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై సమావేశాలు ప్రారంభమైన తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో నిర్ణయించనున్నారు. కాగా ఫిబ్రవరి 27 నుండి సెషన్లను నిర్వహించాలని ప్రభుత్వం తొలుత లక్ష్యంగా పెట్టుకుంది. అయితే మార్చి 3 మరియు 4వ తేదీలలో విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా జరుగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్-2023 మరియు మరికొన్నిఇతర కార్యక్రమాలు కారణంగా బడ్జెట్ సెషన్ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇక బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సంబంధించి త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ వెలువడనుంది.
కాగా అధికారిక వర్గాల ప్రకారం, గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ మార్చి 14న అసెంబ్లీ మరియు కౌన్సిల్ సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ మరుసటి రోజు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను ప్రారంభిస్తారు. దాదాపు ఏడాది వ్యవధిలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నందున, వైసీపీ ప్రభుత్వం సంక్షేమ రంగంపై మరింత దృష్టి సారించే అవకాశం ఉంది. జగనన్న కాలనీలతో పాటు విద్య, వైద్యానికి కూడా కేటాయింపులు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మార్చి 22న తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం మరియు మార్చి 28, 29 తేదీల్లో విశాఖపట్నంలో జీ-20 సదస్సు జరగనున్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు ఆ లోపు ముగిసే అవకాశం ఉంది. అలాగే ఉగాది నుంచి కార్యనిర్వాహక రాజధానిని విశాఖపట్నంకు మారుస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ఈ మేరకు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం సన్నాహక సమావేశంలో, సీఎం జగన్ తన కార్యకలాపాలను వైజాగ్ నుండి ప్రారంభిస్తానని ప్రకటించడం తెలిసిందే. ఈ క్రమంలో బడ్జెట్ సమావేశాల్లోనే దీనిపై సీఎం జగన్ ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, సుప్రీంకోర్టులో దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున సీఎం జగన్ ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదిలా ఉండగా మరోవైపు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై ప్రత్యేక దృష్టి సారించనుంది. ధరల పెరుగుదల, రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య.. ప్రధానంగా ఇటీవల ప్రతిపక్ష నేతలపై, కార్యకర్తలపై దాడులు వంటి ముఖ్యమైన అంశాలను లేవనెత్తడానికి సన్నద్ధమవుతోంది. కాగా వచ్చే ఎన్నికల్లో గెలిచే వరకు మళ్ళీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోనని అప్పటివరకూ సభకు దూరంగా ఉంటానని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు శపథం చేసిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE