ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 22, సోమవారం నాడు క్యాంపు కార్యాలయంలో కరోనా నియంత్రణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వచ్చే 90 రోజుల్లో ప్రతి కుటుంబానికి స్క్రీనింగ్, పరీక్షలు చేయాలని ఆదేశించారు. ప్రతి పీహెచ్సీలో కోవిడ్ శాంపిల్ కలెక్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని, ఒకవేళ కరోనా సోకినట్లు నిర్ధారణ అయితే ఏం చేయాలన్న దానిపై ప్రతి గ్రామ సచివాలయంలో హోర్డింగ్స్ పెట్టి వివరాలను అందుబాటులో ఉంచాలన్నారు. అలాగే ఇకపై మండలానికొక 104 వాహనం వినియోగించుకోవాలని చెప్పారు. వీటిద్వారా షుగర్, బీపీ లాంటీ వ్యాధులకు పరీక్షలు నిర్వహించి వెంటనే అక్కడిక్కడే మందులివ్వాలని సూచించారు. వీరిలో మెరుగైన చికిత్స అవసరమనుకున్న వారిని పీహెచ్సీకి రిఫర్ చేయాలని చెప్పారు. 104 సిబ్బందితో ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు, వాలంటీర్లను అనుసంధానం చేసి నెలలో ఒకసారి తప్పనిసరిగా మండలంలోని అన్ని గ్రామాలకు 104 వాహనం వెళ్లాలని ఆదేశాలు ఇచ్చారు. పరీక్షల తర్వాత వివరాలను క్యూఆర్ కోడ్ తో ఉన్న ఆరోగ్య కార్డులో ఉంచాలని చెప్పారు.
రాష్ట్రంలో కరోనా నియంత్రణకు నిర్దిష్టమైన, పటిష్ఠమైన వ్యూహం అమలు చేయాలనీ అధికారులకు సూచించారు. ప్రణాళిక ప్రకారం కంటైన్మెంట్ జోన్లలో 50 శాతం, మిగతా చోట్ల 50 శాతం కోవిడ్ పరీక్షలు నిర్వహించాలి. అదేవిధంగా స్వచ్చందంగా పరీక్షల కోసం వచ్చే వారికీ కొన్ని కేటాయించాలని చెప్పారు. ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చేవారితో పాటుగా, వైరస్ వ్యాపించడానికి అవకాశం ఉన్న ఇతర రంగాల్లో పనిచేసే వారికీ కూడా కోవిడ్ పరీక్షలు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu