ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్ల విషయమై ఈరోజు సమీక్ష జరిపారు. రైతులకు సేవలు అందించడంలో ఎటువంటి అలసత్వం ఉండరాదని, సమాచార లోపం లేకుండా చూడాలని సీఎం సూచించారు. ఆ దిశగా అధికారులు కృషి చేయాలన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని తాన క్యాంపు కార్యాలయంలో ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. RBK లు క్రియాశీల పాత్ర పోషించాలని సీఎం అన్నారు. ప్రతి రైతుకు కనీస మద్దతు ధర (MSP) లభించటం మన ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశానికి వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఆహార పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు, సీఎస్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి వై మధుసూధనరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో సీఎం జగన్ అధికారులకి కొన్ని సూచనలు చేశారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అవసరమైతే రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్ల విషయంలో మిల్లర్ల పాత్ర ఏమాత్రం ఉండకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కొనుగోలు తర్వాతే మిల్లర్ల పాత్ర ఉండాలన్నారు. ధాన్యం, పంటల కొనుగోలు కోసం ప్రతి ఆర్బీకేలో కూడా కనీసంగా ఐదుగురు సిబ్బంది నియమించాలన్నారు. టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇతర సిబ్బంది ముగ్గురు ఖచ్చితంగా ఉండాలన్నారు. వీళ్లే రైతుల దగ్గరకు వెళ్లి.. వారి నుంచి నేరుగా కొనుగోలుకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయాలి. గన్నీబ్యాగులు, రవాణా వాహనాలు, అవసరమైన హమాలీలను ఈ ఐదుగరు సిబ్బందే ఏర్పాటు చేయాలి. వీటికోసం రైతులు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండకూడదని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ధాన్యం నాణ్యతా పరిశీనలో రైతులు మోసాలకు గురికాకూడదని సీఎం స్పష్టం చేసారు.
ఇతర దేశాలకు నేరుగా ప్రభుత్వంనుంచే ఎగుమతులు చేసేలా చూడాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో వారికి పేమెంట్లు అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని అన్నారు. కొనుగోళ్ల తరవాత రైతులకు పేమెంట్లు ఆలస్యం కాకుండా చూడాలి అని చెప్పారు. అన్ని కొనుగోలు కేంద్రాలు తెరిచారా? లేదా? అన్నదానిపై వచ్చే మూడు నాలుగు రోజుల్లో దృష్టిపెట్టవలసినదిగా అధికారులకు సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద సరిపడా సిబ్బంది ఉండేలా చూడాలి. కొనుగోలు ప్రక్రియ జరుగుతున్న తీరుపై పరిశీలన చేయాలి. తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లండి అని సీఎం అన్నారు. పంటల కొనుగోలు సంబంధిత సమస్యలపై ఫిర్యాదులు, విజ్ఞాపనల కోసం ఒక నంబర్ను పెట్టాలని సీఎం చెప్పారు. ఆ నంబర్కు వచ్చే ఫిర్యాదులను సీరియస్గా తీసుకోవాలని సీఎం ఆదేశం ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ