ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 7, సోమవారం నాడు తన క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాలను ప్రారంభించారు. ఈ పథకాలతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బలవర్ధక ఆహారం అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని మొత్తం 55,607 అంగన్ వాడీల పరిధిలో రూ.1863.11 కోట్ల వ్యయంతో 30,16,000 మంది లబ్దిదారులకు ఈ పథకాలను అందించనున్నారు. 77 గిరిజన, సబ్ప్లాన్ మండలాల పరిధిలోని 8 ఐటీడీఏలు, 52 ఐసీడీఎస్ ప్రాజెక్టులతో పాటు 8,320 అంగన్వాడీ కేంద్రాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాన్ని అమలు చేయనున్నారు. అలాగే 77 గిరిజన మండలాలు మినహా మిగిలిన 47,287 అంగన్వాడీ కేంద్రాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని అమలు చేయనున్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, చిన్నారులకు పౌష్టికాహారం అందించడం కోసమే సంపూర్ణ పోషణ పథకాలను ప్రారంభించామని అన్నారు. రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న గర్భిణీలు, బాలింతలుతో పాటుగా 6 నుంచి 72 నెలలలోపు పిల్లలకు ఈ పథకాల ద్వారా పౌష్టికాహారం అందిస్తామని చెప్పారు. తల్లులకు పోషణ, పిల్లలకు రక్షణగా ఈ పథకాలు మారనున్నాయని పేర్కొన్నారు. అలాగే ఇకపై అంగన్వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ కేంద్రాలుగా మార్చబోతున్నామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.