ఆంధ్రప్రదేశ్లో 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఇక వేడుకల్లో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ శకటాలను సీఎం వైఎస్ జగన్ వీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించారు.
పూర్తి ప్రసంగం ముఖ్యమంత్రి మాటల్లోనే.. స్వాతంత్ర పోరాటానికి నిలువెత్తు రూపం మన జాతీయ జెండా. మన తెలుగువాడైన పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా, భారతీయుల గుండెకు చిరునామాగా నిలిచింది. ఎందరో సమరయోధుల పోరాటాల కారణంగా మనకు స్వాతంత్య్రం లభించింది. ఆ మహనీయుల త్యాగాన్ని, పోరాటాన్ని స్మరించుకుంటూ నేడు స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడం మన అదృష్టం. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య తెలుగువాడు కావడం మనకు గర్వకారణం. స్వాతంత్య్రం వచ్చిన ఈ 75 సంవత్సరాలలో దేశం ఎంతో అభివృద్ధి సాధించింది. ప్రపంచ దేశాలకు ధీటుగా ప్రగతిని సాధిస్తున్నాం. నేడు భారత్ ప్రపంచ ఫార్మా రంగంలో మొదటి స్థానంలో, ఫోన్ వినియోగంలో రెండో స్థానంలో ఉంది, అని తెలిపారు.
ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుకున్న లక్ష్యాల వివరాలను సీఎం జగన్ ప్రజలకు వివరించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన ఈ మూడేళ్ళలో ఎన్నో పాలనాపరమైన సంస్కరణలను అమలు చేశాం. పౌర సేవల్లో మార్పు తీసుకొచ్చి గణనీయమైన అభివృద్ధిని చేసి చూపించాం. ప్రతి నెలా అర్హులకు ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు అందిస్తున్నాం. అలాగే రైతులకు విత్తనం నుండి విక్రయం వరకు అండగా ఉంటున్నాం. కుల, మతాలకు అతీతంగా.. లంచాలకు, అవినీతికి తావు లేకుండా.. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం అని వెల్లడించారు. ఇక ఈ వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY