సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు పోస్టింగ్ ఇచ్చింది. ఏపీ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా ఏబీ వెంకటేశ్వరరావును నియమిస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ బాధ్యతలు నిర్వహిస్తున్న జి.విజయ్కుమార్ను ప్రభుత్వం రిలీవ్ చేసి, ఆ స్థానంలో ఏబీ వెంకటేశ్వరరావును నియమిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు ఇచ్చారు. ముందుగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్ గా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో ఉద్యోగ నియమావళి, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఫిబ్రవరి 8, 2020న వైసీపీ ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది.
అనంతరం ఏబీ వెంకటేశ్వరరావు ఏపీ హైకోర్టును ఆశ్రయించగా, సస్పెన్షన్ ఎత్తివేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సివిల్ సర్వీసెస్ అధికారులను రెండు సంవత్సరాలకు మించి సస్పెన్షన్లో ఉంచరాదని, ఏబీవీకి వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇటీవలే ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో మే 19న ఆయన ఏపీ సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయగా, తాజాగా ఆయనకు పోస్టింగ్ ఇస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY