విశాఖపట్నం పరిధిలోని విస్సన్నపేట గ్రామంలో 609 ఎకరాల భూమిని తాను కాజేసినట్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. చంద్రబాబు సవాల్ను తాను స్వీకరిస్తున్నానని, తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. 609 ఎకరాల్లో ఒక్క సెంటు భూమి తన పేరు మీద కానీ, తన కుటుంబ సభ్యుల పేరిట కానీ ఉన్నా.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. తమ కుటుంబం తాము తప్పు చేయాల్సి వస్తే రోడ్డుమీద ఉరి వేసుకుంటాం.. లేకపోతే పీక తీసి పక్కన పెట్టుకుంటామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తనపై ఆరోపణలు నిరూపించకపోతే చంద్రబాబు రాజకీయ సన్యాసం చేయాలని తాను కోరనని స్పష్టం చేశారు. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబుకు వయస్సు అయిపోయిందని, అందుకే తన కుమారుడు నారా లోకేష్ను రాజకీయాల నుంచి తప్పిస్తారా అంటూ సవాల్ విసిరారు. చంద్రబాబు చెప్పేది ప్రజలు నమ్మరని, ఆయన కొడుకులా గల్లీ నుంచి రాజకీయాల్లోకి రాలేదని విమర్శలు గుప్పించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న షుగర్ ఫ్యాక్టరీలను ఎవరు మూయించారని ప్రశ్నించిన మంత్రి అమర్నాథ్.. ఘగర్ ఫ్యాక్టరీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని అన్నారు. సీఎం జగన్ అధికారంలో ఉన్నంత కాలం తనకు రాజకీయంగా నష్టమేనని చంద్రబాబు భావిస్తున్నారని, అందుకే రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను చెడగొట్టేలా ఆయన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రజలు త్యాగాలు చేస్తే చంద్రబాబు భోగాలు అనుభవిస్తారని ఎద్దేవా చేసిన మంత్రి.. విశాఖపై చంద్రబాబు ఎందుకు విషం చిమ్ముతున్నారని ప్రశ్నించారు. ఇక ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ 90 శాతం విజయం సాధించిందని, ఇవే ఫలితాలు వచ్చే ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయని పేర్కొన్నారు. నాడు ఎన్టీ రామారావుకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, అయితే నేడు అదే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు పేరుతో మరో కొత్త నాటకానికి తెరతీశారని అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాకుండా అధికారం కోల్పోయిన తర్వాత ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తారని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE