కరోనా వైరస్ వేరియంట్ B.1.36 (ఎన్440కే) పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ స్పష్టతనిచ్చింది. ఏపీలో ఎన్440కే వైరస్ వేరియంట్ తీవ్రంగా ఉన్నట్టు ఎలాంటి నిర్థారణ జరగలేదని, అలాంటి పరిశోధన డేటా ఏమీలేదని ఏపీ స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ ఛైర్మన్ కేఎస్ జవహర్ రెడ్డి అన్నారు.
“ఏపీ, తెలంగాణ మరియు కర్ణాటకకు సంబంధించిన శాంపిల్స్ పై హైదరాబాద్లో సీసీఎంబీ జీనోమ్ సీక్వెన్సింగ్ జరిగింది. ఏపీ ప్రయోగశాలల నుండి ప్రతి నెలా సగటున 250 నమూనాలను సీసీఎంబీకి పంపుతున్నారు. దక్షిణ భారతదేశం (ఏపీ, కర్ణాటక, తెలంగాణ) శాంపిల్స్ నుండి 2020 జూన్-జూలై నెలలో ఎన్440కే స్ట్రెయిన్ ఆఫ్ కరోనా వైరస్ (B.1.36) కనుగొనబడింది. ఈ స్టెయిన్ ప్రభావం డిసెంబర్ 2020 మరియు జనవరి, ఫిబ్రవరి 2021లో ప్రబలంగా ఉంది మరియు మార్చిలో బాగా పడిపోయింది. అలాగే ఇప్పుడు నమోదవుతున్న పాజిటివ్ కేసులలో ఎన్440కే యొక్క వాటా చాలా తక్కువ. ప్రస్తుతం B.1.617 మరియు B.1 కరోనా వైరస్ స్ట్రెయిన్ల ప్రభావం దక్షిణ భారతదేశంలో(ఏపీ, కర్ణాటక, తెలంగాణ) ఎక్కువుగా ఉంది. ఏప్రిల్ నెల పాజిటివ్ కేసుల డేటా బట్టి ఇది గుర్తించబడింది మరియు ఇది చాలా వేగంగా సంక్రమిస్తుంది, పెద్దల నుండి చిన్న వయస్సు వారికీ కూడా వ్యాప్తి చెందుతోంది” అని పేర్కొన్నారు.
“ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ 25న జారీ చేసిన ఏపీడేమియోలాజికల్ కోవిడ్-19 వీక్లీ అప్డేట్ లో భారతదేశం నుండి వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్ గా B.1.617 గురించి ప్రస్తావించింది కానీ ఎన్440కే వేరియంట్ గురించి ప్రస్తావించలేదు. మీడియా ప్రచారంలో ఉన్నట్టు ఎన్440కే వేరియంట్ ప్రభావం ప్రజారోగ్యంపై ఉంటే డబ్ల్యూహెచ్వో నివేదికలతో పాటు ఐసీఎంఆర్ నివేదికల్లో కూడా ఉండి ఉండాలి. అందువల్ల ఇప్పటివరకు పరిశోధన డేటా ఎన్440కే వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్ అని, ప్రభావం చాలా తీవ్రంగా ఉందని నిర్ధారించలేదు. శాస్త్రీయ అంశాలకు సంబంధించిన విషయాలను ప్రసారం చేయడంలో బాధ్యత వహించాలని, ఈ మహమ్మారి సమయంలో ప్రజల్లో భయాందోళనలు సృష్టించకుండా ఉండాలని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం” అని కేఎస్ జవహర్రెడ్డి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ