ఆంధ్రప్రదేశ్లో రోడ్ షోలు, ర్యాలీలకు అనుమతి నిరాకరిస్తూ జగన్ సర్కార్ కొత్తగా తీసుకొచ్చిన జీవో నెం.1పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ప్రతిపక్ష పార్టీలు దీనిపై తీవ్ర అభ్యంతరం తెలుపుతుండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జీవో అమలు చేయడానికే నిశ్చయించుకుంది. ఈ నేపథ్యంలో దీనిపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఈ అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయంపై కూడా మంత్రి మండిపడ్డారు.
ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ప్రజా శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం జీవో నెం.1ను తీసుకొచ్చిందని, ఎట్టి పరిస్థితుల్లో దీనిని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇక ప్రభుత్వం ఒక జీవో తెచ్చిందంటే, దానిని అందరూ గౌరవించాల్సిందేనని, పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే చంద్రబాబు మాత్రం ప్రభుత్వం తెచ్చిన జీవో తమకు వర్తించదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ప్రభుత్వం జీవో తెచ్చాక, పోలీసులు పర్మిషన్ ఇవ్వడం కుదరదని చెప్పాక కూడా ఆయన కుప్పం వెళ్లడంలో ఆంతర్యం ఏమిటని మంత్రి ప్రశ్నించారు.
ఇంకా మంత్రి అంబటి మాట్లాడుతూ.. కుప్పంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పరాజయంతో చంద్రబాబులో భయం మొదలైందని, అందుకే హడావిడిగా కుప్పంలో పర్యటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయన సభలకు హాజరైన ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, అందుకే ప్రభుత్వం బాధ్యతతో ఆలోచించి ఈ జీవోను తెచ్చిందని పేర్కొన్నారు. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు వత్తాసు పలుకుతుండటాన్ని ప్రజలు గమనిస్తున్నారని, ఆయన ఇకనైనా ప్రతిదీ రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు. వీరిద్దరూ ఎన్ని ప్రయత్నాలు చేసినా వచ్చే ఎన్నికల్లో ప్రజలు సీఎం జగన్ వైపే ఉంటారని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE