ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 12 కార్పొరేషన్లకు మరియు 71 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు మార్చి 10 పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. కాగా మార్చి 14, ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక, మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికను మార్చి 18న నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ ఆదేశాలు ఇచ్చారు. ఏలూరులో కార్పొరేషన్ లో ఫలితాలు వెల్లడించవద్దని హైకోర్టు ఆదేశాలు ఉండడంతో మిగిలిన 11 కార్పొరేషన్లు మరియు 75 మున్సిపాలిటీల్లో పరోక్ష పద్ధతిలో మార్చి 18న ఎన్నిక నిర్వహించనున్నారు.
మార్చి 14 న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ అనంతరం కార్పొరేటర్లుగా గెలుపొందిన వారు ఆయా కార్పొరేషన్స్ లో మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకోనున్నారు. అలాగే వార్డు సభ్యులుగా విజయం సాధించిన వారు మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ లను ఎన్నుకుంటారు. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో మార్చి 18, గురువారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సమావేశంలో ముందుగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అలాగే ఈ సమావేశానికి ఓటు హక్కు ఉన్న మొత్తం సభ్యులలో కనీసం సగం మంది హాజరైతే కోరం ఉన్నట్టుగా పరిగణించి మేయర్, డిప్యూటీ మేయర్ మరియు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నికలను చేపడతారు. కోరం లేకుంటే ఎన్నికను ప్రిసైడింగ్ అధికారి వాయిదా వేసే అవకాశం ఉంది. ఈ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రిసైడింగ్ అధికారులను నియమించింది. మరోవైపు గుర్తింపు కలిగిన 18 పార్టీలకు ఈ ఎన్నికల్లో విప్ జారీచేసే అధికారాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కల్పించింది. ఇక ఎక్స్ అఫిషియో సభ్యుల హోదాలో ఆయా ప్రాంతాల్లోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ ఎన్నికలో పాల్గొననున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ