రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఓటు వేసి ఆమె విజయానికి సహకరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ ప్రతినిధులకు పిలుపునిచ్చారు. మంగళవారం ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా విజయవాడ గేట్ వే హోటల్లో చంద్రబాబు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ముందుగా గేట్ వే హోటల్ కు చేరుకున్న ద్రౌపది ముర్ముకు చంద్రబాబు, ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, నిమ్మల రామానాయుడు ఘనంగా స్వాగతం పలికారు. ద్రౌపది ముర్ము వెంట బీజేపీ నేత కేంద్ర మంత్రి కిషన్రెడ్డి రాగా, ఈ సమావేశంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ నేతలు సీఎం రమేశ్, జీవీఎల్ నరసింహారావు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, గిరిజన కుటుంబంలో పుట్టిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంతో, సామాజిక న్యాయం కోసం ఆమెకు మద్దతివ్వాలని నిర్ణయించామని అన్నారు. గతంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కేఆర్ నారాయణ్ ను, మైనార్టీ వర్గానికి చెందిన అబ్దుల్ కలాం, ఆ తర్వాత రామ్ నాథ్ కోవింద్ కు మద్ధతు ఇచ్చామని చెప్పారు. తాజాగా ద్రౌపది ముర్మును ఎంపిక చేయడంలో కూడా తాము భాగస్వామ్యులు కావడం అదృష్టంగా భావిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ద్రౌపది ముర్మును ఎంపిక చేసిన ప్రధాని నరేంద్ర మోదీని అభినందిస్తున్నానని అన్నారు. అనంతరం ద్రౌపది ముర్ము మాట్లాడుతూ, “రాష్ట్రపతి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేయడం మహిళా సాధికారతకు, సామాజిక న్యాయానికి లభించిన గౌరవంగా భావిస్తున్నాను. నా అభ్యర్థిత్వాన్ని బలపరిచిన టీడీపీకి కృతజ్ఞతలు. మీ సోదరి దేశ అత్యున్నత పీఠం అధిష్టించేలా ఆశీర్వదించండి” అని కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY