తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు 98వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ తనయుడు, ప్రముఖ నటుడు బాలకృష్ణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, కుటుంబ సభ్యులు మరియు పలువురు పార్టీ సభ్యులు, అభిమానులు ఎన్టీఆర్ కు నివాళులర్పించారు.
“అధికారం అన్నది అనుభవించడానికి కాదు,ప్రజలకు సేవ చేయడానికి అన్న మానవీయ సిద్ధాంతాన్ని తొలిసారిగా రాజకీయాల్లోకి, పాలనలోకి తెచ్చి ఆచరించి చూపిన మహనీయుడు ఎన్టీఆర్. అప్పటివరకు ఓటు బ్యాంకులుగా పరిగణించబడిన పేదల కడుపులోని ఆకలిని,బతుకులోని కష్టాలని తొంగిచూసిన తొలి రాజకీయనాయకుడు ఎన్టీఆర్. ప్రతి తెలుగువాడు గర్వించేలా సినీ,రాజకీయ రంగాలలో ఒక అసాధారణ చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ విశ్వవిఖ్యాతుని ఆదర్శాలను, ఆశయాలను మననం చేసుకుంటూ, ప్రజాసేవలో స్ఫూర్తిని పొందుదాం. తిరుగులేని ఆ ప్రజా నాయకుని స్మృతికి నివాళులర్పిద్దాం” అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, ఎన్టీఆర్ యుగపురుషుడని, తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని అన్నారు. ఎన్టీఆర్పై ఎందరో పుస్తకాలు రాశారని చెప్పారు. ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా అందుబాటులోకి తీసుకురావాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు.
“ఎన్టీఆర్ గారి జీవితం అప్పుడప్పుడూ స్మరించుకునే చరిత్ర కాదు.ప్రతిరోజూ చదవాల్సిన స్ఫూర్తి పాఠం.ఒక సామాన్యుడి స్థాయి నుంచి అసామాన్యుడిగా, అసాద్యుడిగా, చారిత్రాత్మక నాయకుడిగా ఎదిగేందుకు కృషి, క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీలను తన వ్యక్తిత్వంలోనూ, జీవితంలోనూ భాగం చేసుకున్నారు ఎన్టీఆర్. సాటి మనిషిని నిస్వార్థంగా ఆదుకోవడంలో ఎన్టీఆర్ గారే నాకు స్ఫూర్తి.బడుగు వర్గాలకు అన్నివిధాలా అండగా నిలిచి,వారి ఎదుగుదలకు ప్రాణం పోసిన మహానాయకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మానవతావాది ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని సమసమాజ స్థాపనకు కృషిచేద్దాం” నారా లోకేష్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ