టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక సమస్యపై ప్రభుత్వ తీరును విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన ఘాటుగా స్పందించారు. ‘ వైసీపీ ప్రభుత్వం సృష్టించిన ఇసుక సమస్యతో ఉపాధి కోల్పోయి లక్షలాదిమంది కార్మికులు పస్తులుంటున్నారు. వారందరికీ పరిహారం ఇమ్మని టీడీపీ డిమాండ్ చేస్తే ఇచ్చేది లేదని మంత్రి మాట్లాడడం వైసీపీ నిర్లక్ష్యానికి పరాకాష్ట, పాత ఇసుక విధానం రద్దు చేయమని కార్మికులు అడిగారా? మీ ఇష్టానుసార నిర్ణయాలకు లక్షలాది కార్మిక కుటుంబాలు బలి కావాలా?’ అని ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు.
మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడ ఇసుక సమస్య నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో స్పందించారు. ‘ జగన్ అండ్ కో ఇసుక నుండి తైలం తీయగల సమర్థులు అని మరోసారి నిరూపించుకున్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ఇసుక ధరని రెండింతలు పెంచి ప్రజల నెత్తి పై గుదిబండ వేసారు. ఆంధ్రప్రదేశ్ లో సామాన్య ప్రజలకు దొరకని ఇసుక అక్రమ మార్గంలో ఇతర రాష్ట్రాలకు తరలి పోతుంది. ఇసుక కొనడానికి ప్రజల ఇల్లు గుల్ల అవుతుంటే, ఇసుక దోపిడీ ద్వారా వచ్చిన డబ్బు దాచుకోవడానికి ఇల్లు సరిపోక వైకాపా నాయకులు విదేశాలు వెళ్లి వస్తున్నారు. అధికారం చేపట్టిన ఐదు నెలల్లోనే రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టేసారు.భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి చూస్తుంటే ఆందోళనగా ఉందని’ చెప్పారు.
‘ముఖ్యమంత్రి అయిన తరువాత మాత్రమే రాష్ట్రంలో ఉండటానికి ఇష్టపడిన జగన్ గారు, 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రాష్ట్రం నుండి బయటకు పంపాలని కక్ష కట్టారు. కృత్రిమ ఇసుక కొరత సృష్టించి భవన నిర్మాణ కార్మికులను అప్పుల ఊబిలోకి నెట్టేశారు. తెదేపా హయాంలో రూ.10 వేలు ఉన్న లారీ ఇసుకను ఇప్పుడు వైకాపా ఇసుకాసురులు 40 వేల నుండి లక్ష రూపాయిలకు అమ్ముకుంటూ ప్రజలను లూటీ చేస్తున్నారని అన్నారు. నిర్మాణరంగం పడకేసి, కార్మికులు పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. 5 నెలల నుండి పని లేకుండా చేసి 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టిన వైకాపా ప్రభుత్వం, ఒక్కో కార్మికుడికి నెలకి రూ.10 వేలు చొప్పున 50 వేల భృతి వెంటనే చెల్లించాలని’ నారా లోకేష్ డిమాండ్ చేసారు. మరో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడ భవన నిర్మాణ కార్మికుల కోసం నవంబరు 3న విశాఖలో లాంగ్ మార్చ్ చేపట్టాలని నిర్ణయించుకున్నారు.
[subscribe]