ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 28, సోమవారం నాడు జాతీయ విద్యా విధానంలో భాగంగా రాష్ట్రంలో ఉన్నత విద్యా విధానంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా శాఖ ఉన్నతాధికారులకు సీఎం వైఎస్ జగన్ పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో అన్ని కాలేజీలు మూడేళ్లలోగా పూర్తి ప్రమాణాలతో నడిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ సహా అన్ని కాలేజీలు తప్పనిసరిగా నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ), నేషనల్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (ఎన్ఏసీ–న్యాక్) గుర్తింపు పొందాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రమాణాలు పాటించని ఇంజనీరింగ్, ఇంటర్మీడియట్, ఇతర కాలేజీలకు నోటీసులు జారీ చేయాలని, మూడేళ్లలో ఆయా కాలేజీల్లో ఎలాంటి మార్పు రాకపోతే కచ్చితంగా చర్యలు తీసుకోవాలన్నారు. కాలేజీలలో తనిఖీ కోసం 10 బృందాలు ఏర్పాటు చేసి శాశ్వత స్వ్కాడ్ గా పనిచేయాలని సూచించారు. ప్రమాణాలు, నాణ్యత అంశాలపై కాలేజీలకు కొంత సమయం ఇచ్చి మార్పు చేసేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ఈ తనిఖీ ప్రక్రియ నిరంతరం కొనసాగేలా చూడాలన్నారు.
మరోవైపు ఇకనుండి రాష్ట్రంలో ఏడాది లేదా రెండేళ్ల పీజీ ప్రోగ్రాములు మరియు మూడు లేదా నాలుగేళ్ల డిగ్రీ ప్రోగ్రాములు ఉండాలని పేర్కొన్నారు. ఈ ఏడాది నుంచే ఈ కోర్సులు ప్రారంభం అయ్యేలా చూడాలన్నారు. 4 ఏళ్ల డిగ్రీ కోర్సు పూర్తి చేసిన వారికి నేరుగా పీహెచ్డీ లో అడ్మిషన్లు పొందేలా అర్హత కల్పించాలని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అదేవిధంగా వచ్చే ఏడాది నుంచి 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్స్ మరియు 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టాలన్నారు. రాష్ట్రంలో దాదాపుగా 3 వేల కాలేజీలు ఉండగా, వాటిలో కేవలం 104 మాత్రమే అటానమస్గా హోదాలో పని చేస్తున్నాయని, అటానమస్ కాలేజీల సంఖ్య పెంచే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu