ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం గృహ నిర్మాణశాఖపై కీలక సమీక్ష నిర్వహించారు. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం, కాలనీల్లో మౌలిక సదుపాయాలు, టిడ్కో ఇళ్లు సహా పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముందుగా రాష్ట్రంలో గృహ నిర్మాణంలో పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. ఇళ్లనిర్మాణాల్లో నాణ్యతను పరీక్షించేందుకు మొత్తంగా 36 ల్యాబ్స్ ఏర్పాటు చేశామని, ఇళ్ల నిర్మాణంలో ఉపయోగించే మెటల్ నాణ్యతపై 285 పరీక్షలు, సిమెంటుపైన 34 పరీక్షలు, స్టీలుపై 84 పరీక్షలు, ఇటుకలపైన 95, ఇలా పలురకాల పరీక్షలు నిర్వహించామని అధికారులు తెలిపారు. ఎక్కడ లోపం వచ్చినా, వెంటనే గుర్తించి, నాణ్యతను పెంచుకునేందుకు ల్యాబ్స్ ఉపయోగపడుతున్నాయని చెప్పారు.
అనంతరం సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, సొంత ఇల్లు అనేది పేదవాడి కల అని, ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి లోపం ఉండకూడదని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ ల్యాబ్స్ ను వినియోగించుకుని ఎప్పటికప్పుడు పరీక్షలను నిర్వహించి, పేదవాడికి అత్యంత నాణ్యమైన ఇంటిని అందించాన్నారు. సీఎం ఆదేశాల మేరకు పూర్తయిన ఇళ్లకు 15 రోజుల్లోగా విద్యుత్ కనెక్షన్ ట్రాన్స్కో ఇస్తుండగా, లే అవుట్లలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన తర్వాత వాటి నిర్వహణ విషయంలో గ్రామ, వార్డు సచివాలయాలు కీలక పాత్ర పోషించాలని సీఎం సూచించారు.
ఇళ్ల నిర్మాణ కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలాఖరు వరకూ చేసిన రూ.7630 కోట్లు ఖర్చు చేశామని, ఈ ప్రభుత్వం ఇప్పటివరకూ మొత్తంగా రూ.13,780 కోట్లు కేవలం ఇళ్ల నిర్మాణం కోసమే ఖర్చు చేసిందన్నారు. ఇప్పటికి సుమారుగా 2.75 లక్షల ఇళ్లను పూర్తిచేశామని, మరో మరో 74వేల ఇళ్లలో శ్లాబు వేసే పనులు జరుగుతున్నాయన్నారు. మరో 79 వేల ఇళ్లు రూఫ్ లెవల్లో ఉన్నాయని, మార్చి నాటికి పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద చేపట్టిన ఇళ్లలో సుమారు 5 లక్షల ఇళ్లు పూర్తిచేసే దిశగా పనులు జరుగుతున్నాయని అధికారులు సీఎంకు తెలిపారు.
టిడ్కో ఇళ్లపై సమీక్ష సందర్భంగా సీఎం మాట్లాడుతూ, టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు ఈ ప్రభుత్వం గణనీయంగా సహాయం అందించిందన్నారు. టిడ్కో ఇళ్ల కోసం గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన ఖర్చు రూ.8015 కోట్లు అయితే ఈ ప్రభుత్వం చేసిన ఖర్చు, పేదలకు కల్పించిన ప్రయోజనాలు విలువ చూస్తే మొత్తంగా రూ.20,745 కోట్లని సీఎం తెలిపారు. టిడ్కో ఇళ్ల నిర్మాణ ఖర్చు కింద, మౌలిక సదుపాయాలకోసం ఈ మూడున్నర సంవత్సరాల్లోనే రూ.8,734 కోట్లు ఖర్చుచేశామని, దీంతోపాటు 300 అడుగుల ఇళ్లను ఉచితంగా ఇవ్వడం వల్ల దాదాపు రూ.10,339 కోట్ల రూపాయల లబ్ధి పేదలకు జరిగిందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE