ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం రాష్ట్రంలో రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాలపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, అక్టోబరు మాసానికల్లా వర్షాలు తగ్గుముఖం పడతాయని, ముందుగా రోడ్లను బాగుచేయడంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా రాష్ట్రంలో రోడ్లన్నింటినీ బాగుచేయాలని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లపై ప్రత్యేక దృష్టిపెట్టామని, గత ప్రభుత్వంలో రోడ్లను పూర్తిగా విడిచిపెట్టారని అన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాదీ వర్షాలు మంచిగా పడ్డాయి, దేవుడి దయవల్ల వర్షాలు బాగా పడ్డం వల్ల రైతులు సంతోషంగా ఉన్నారు, వర్షాలు పడ్డం వల్ల మరోవైపు రోడ్లు కూడా దెబ్బతిన్నాయి. రోడ్లను బాగుచేయడనికి ఈ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని సీఎం జగన్ పేర్కొన్నారు. వనరుల సమీకరణలో అనేక చర్యలు తీసుకుంటున్నామని, ఒక నిధిని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.
రోడ్లను బాగుచేయడానికి ఇప్పటికే చాలావరకూ టెండర్లు పిలిచారని, మిగిలిన చోట్ల కూడా ఎక్కడైనా టెండర్లు పిలవకపోతే వెంటనే టెండర్లు పిలవండని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. అక్టోబరులో వర్షాలు ముగియగానే పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుని, మరొకసారి నిశితంగా వాటిని పరిశీలించి, నివేదికలు ఆధారంగా ఫోకస్ పెట్టి రోడ్లను బాగుచేయాలని చెప్పారు. సంబంధిత ప్రభుత్వ విభాగాలతో కలిసి కూర్చుని కార్యాచరణ ఏర్పాటు చేసుకోవాలన్నారు. అలాగే బ్రిడ్జిల వద్ద అప్రోచ్ రోడ్లు పూర్తికాక చాలా రోడ్లు అసంపూర్తిగా ఉండిపోయాయని, వీటిని వెంటనే పూర్తిచేసేలా కార్యాచరణ సిద్ధంచేసి, పనులు పూర్తిచేయాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో వివిధ జాతీయ రహదారుల ప్రగతి, రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం పోర్టులు, భోగాపురంలో ఎయిర్పోర్టు నిర్మాణంపై కూడా సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ