విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో “జయహో బీసీ మహా సభ” ఘనంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి దాదాపు 84 వేల మందికి పైగా బీసీ ప్రజా ప్రతినిధులుతో పాటుగా బీసీ నేతలు, బీసీ శ్రేణులు ఈ సభకు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సభకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరై కీలక ప్రసంగం చేశారు. సభకు హాజరైన బీసీ సోదరులందరికీ, బీసీ అక్కచెల్లెమ్మలందరికీ నిండుమనసుతో, రెండు చేతులు జోడించి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని సీఎం వైఎస్ జగన్ ప్రసంగం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నుకున్న బీసీ ప్రజాప్రతినిధులు సహా అన్ని పదవుల్లో ఉన్న బీసీ కుటుంబం ఈరోజు జనసముద్రంలా తన ముందు ఉందని అన్నారు. బీసీ అంటే శ్రమ, బీసీ అంటే పరిశ్రమ అని అన్నారు. మన ఇంటి గడప, ఇంటి ఇటుకలు, ఇంటి పునాది నుంచి పైకప్పు వరకు ప్రతీ అనువు బీసీ అని, వ్యవసాయానికి ఉపయోగించే ప్రతీ పనిముటు తయారీ బీసీ అని, మన హరిదాసులు, బుర్ర కథ, గంగిరెద్దుల ఆట మొదలు అన్ని రకాల సంస్కృతిక కళారూపాలన్నీ బీసీ అని సీఎం పేర్కొన్నారు. బీసీల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేశ సంస్కృతికి, సంప్రదాయాలకు, నాగరికతకు ఎంత చరిత్ర ఉందో, వాటిని వేల సంవత్సరాలుగా వారి భుజస్కంధాల మీద మోస్తున్న ఘనమైన చరిత్ర బీసీలది అని సీఎం అన్నారు.
రాష్ట్రంలో 3648 కిలోమీటర్లు సాగిన తన పాదయాత్రలో 139 బీసీ కులాల్లో ప్రతీ ఒక్క కులాన్ని కలిసి వారి కష్టాలు, నష్టాలు అన్ని చూసి, వారి ఆశలు, ఆకాంక్షలను తెలుసుకుని 2019 ఫిబ్రవరిలో ఏలూరులో బీసీ గర్జన నిర్వహించామన్నారు. ఆ గర్జనలో బీసీ కులాలు వెనుకబడిన కులాలు కాదని, వీటిని వెన్నెముక కులాలుగా మార్చే ప్రతీ ప్రయత్నం చేస్తానని ఆరోజు చెప్పానని అన్నారు. 2014లో బీసీలకు ఏకంగా చంద్రబాబు 114 వాగ్దానాలు ఇచ్చాడన్నారు. అందులో 10 శాతం కూడా అమలు చేయకుండా దగా చేసిన ఆ చంద్రబాబుకు, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకున్న ఈ ప్రభుత్వానికి మేము ఇప్పుడు వెన్నెముక కులాలుగా మారామని చంద్రబాబుకు చెప్పాలని బీసీ ప్రతినిధులకు సీఎం జగన్ సూచించారు. నేడు రాజ్యాధికారంలో మేమంతా భాగస్వాములమని గట్టిగా అర్థమయ్యేలా చంద్రబాబుకు బీసీలు చెప్పాలన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 139 కులాల పేర్లతో 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశానని సగర్వంగా తెలియజేస్తున్నానని అన్నారు. శాశ్వత బీసీ కమిషన్ను దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోనే నియమించాం. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు, మైనార్టీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పాం. ఆ మాటను తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం చేశాం. నామినేషన్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు హామీ ఇచ్చామని, దీన్ని కూడా తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం చేసి మరీ అమలు చేస్తున్నాన్నారు. బీసీల కోసం జగనన్న చేదోడు, జగనన్న తోడు పథకాలు తీసుకొచ్చామన్నారు. 45 సంవత్సరాలు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కచెల్లెమ్మల కోసం చేయూత పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.
“బీసీలకు బడ్జెట్లో కాదు, గుండెల్లో స్థానమిచ్చాం. డీబీటీ, నాన్ డీబీటీ కింద మూడున్నరేళ్ల పాలనలో ఏకంగా రూ.1.63 లక్షల కోట్లు ఖర్చు చేశాం. కేవలం డీబీటీ ద్వారా అక్షరాల రూ.86 వేల కోట్ల సాయం అందించాం. నా మనసంతా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, నిరుపేద వర్గాలవారే. నా ఆచరణ కూడా మీరే. నా వెనక ఉన్న ఆ నలుగురు కూడా మీరే అని సగర్వంగా తెలియజేస్తున్నాను” అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE