వైసీపీ సర్కార్ను గద్దె దించడమే లక్ష్యంగా విపక్ష జనసేన-టీడీపీ కూటమి పావులు కదుపుతోంది. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. సరికొత్త ఎత్తుగడలు వేస్తోంది. అయితే జనసేన-టీడీపీ కూటమి ఎత్తుగడలకు పై ఎత్తులు వేస్తున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ఈసారి తెలుగు దేశంతో కలిసి జనసేన ఎన్నికలకు వెళ్తుండడంతో.. సినీ రంగం నుంచి దెబ్బపడే అవకాశం ఉందని జగన్ భావిస్తున్నారు. ఈక్రమంలో ఆ లోటును పూడ్చే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నారు.
ముగ్గురు సినిమా రంగానికి చెందిన వ్యక్తులను బరిలోకి దింపేందుకు జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. హాస్యనటుడు, ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు ఆలీ, డైరెక్టర్ వీవీ వినాయక్, రెబల్ స్టార్ కృష్ణం రాజు సతీమణి శ్యామలాదేవిలను ఎన్నికల బరిలోకి దింపాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. మైనార్టీలు ఎక్కువగా ఉండే స్థానం నుంచి పోటీ చేయాలని ఆలీ ప్రయత్నిస్తున్నారు ఈక్రమంలో కర్నూల్ లేదా నంద్యాల నుంచి వైసీపీ తరుపున లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. ఆ రెండింటిలో ఏదో ఒక టికెట్ ఇచ్చేందుకు అటు జగన్మోహన్ రెడ్డి కూడా సిద్ధంగా ఉన్నారట.
ఇక డైరెక్టర్ వీవీ వినాయక్ను కూడా లోక్సభ ఎన్నికల బరిలోకి దింపేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. వినాయక్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన్ను బరిలోకి దింపడం ద్వారా ఇటు సినీ రంగం నుంచి.. అటు కాపుల నుంచి మైలేజ్ వస్తుందని జగన్ భావిస్తున్నారు. దీంతో రాజమండ్రి నుంచి లోక్ సభ ఎన్నికల బరిలోకి వీవీ వినాయక్ను దింపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వీవీ వినాయక్తో జగన్ సంప్రదింపులు జరిపారట. త్వరలో ఆయన వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
ఇక కృష్ణం రాజు సతీమణి శ్యామలాదేవిని నరసాపురం నుంచి పోటీ చేయించాలని జగన్ అనుకుంటున్నారట. ఇప్పటికే శ్యామలాదేవిని వైసీపీ నేతలు సంప్రదించారట. అటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు శ్యామలాదేవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురి పేర్లు వైసీపీ నాలుగో జాబితాలో ఉండనున్నాయని ప్రచారం జరుగుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE