ఆంధ్రా ఆక్టోపస్.. లగడపాటి రాజగోపాల్ రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తున్నారు. రాబోయే ఎలక్షన్ బరిలోకి దిగాలని.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పోటీచేయాల్సిందేనని అనుచరులు, కోరడంతో.. రాజకీయాల్లోకి మళ్లీ వస్తున్నారు. లగడపాటిని విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేయించాలనేదే ముఖ్య అనుచరుల ఉద్దేశం. దీనికోసమే తాజాగా విజయవాడలోని ఓ హోటల్లో కొందరు రహస్యంగా భేటీ కూడా అయ్యారట. అంతేకాదు.. ప్రముఖ పార్టీల అధినేతలు కూడా లగడపాటికి టచ్లోకి వెళ్లారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఓ పార్టీ ముఖ్యనేత.. జాతీయస్థాయిలో చర్చలు జరపగా.. అటు రాజగోపాల్ కూడా వేరే ఒక ప్రముఖ వ్యక్తితో టచ్లోకి వెళ్లారని తెలుస్తోంది.
ఇక 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున లగడపాటి రాజగోపాల్ విజయవాడ పార్లమెంట్ నుంచి పోటీచేసి రెండుసార్లు కూడా విజయం సాధించారు. 2004లో టీడీపీ అభ్యర్థి, ప్రొడ్యూసర్ అశ్వనీదత్పై 114,487 ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా.. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీపై 12,712 ఓట్ల తేడాతో గెలిచారు. 2014లో ఉమ్మడి రాష్ట్రం విడిపోయే ముందు రాజగోపాల్ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. రాష్ట్రం విడిపోదని బలంగా నమ్మిన లగడపాటి..విడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు.అయినా రాష్ట్రం విడిపోవడంతో ఇచ్చిన మాటకు కట్టుబడి రాజకీయాల నుంచి బయటకు వచ్చేసారు.
ఆ మధ్య లగడపాటి టీడీపీ వైపు మొగ్గు చూపిస్తున్నారని.. విజయవాడ లేదా ఏలూరు నుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చినా అదేమీ జరగలేదు. ఇప్పుడు కూడా టీడీపీ అధినేతతో స్వయంగా రాజగోపాలే టచ్లోకి వెళ్లారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ లగడపాటికి టీడీపీ టికెట్ దక్కితే మాత్రం గెలుపు పక్కా అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు మాజీ సీఎం, బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో.. లగడపాటి రాజగోపాల్కి మంచి స్నేహ సంబంధాలే ఉన్నాయి. బీజేపీలో చేరిన అతి కొద్దిరోజుల్లోనే కిరణ్ కుమార్ రెడ్డికి మంచి ప్రాధాన్యత ఇచ్చింది కమలం పార్టీ. దీంతోనే బీజేపీ గూటికి చేరితే బాగుంటుందని కిరణ్ కుమార్ రెడ్డే లగడపాటిని స్వయంగా ఆహ్వానించారట. తమ పార్టీలో చేరితే విజయవాడ పార్లమెంట్ నుంచి టికెట్ పక్కా అని కమలనాథుల నుంచి ఆంధ్రా ఆక్టోపస్కు హామీ కూడా దొరికిందట.
ఒకవేళ టీడీపీతో పొత్తు ఉన్నా కూడా విజయవాడ టికెట్ కచ్చితంగా లగడపాటికే ఇస్తామనే సంకేతాలు కూడా బీజేపీ పెద్దల నుంచి ఇప్పటికే అందాయట. అయితే పొత్తుల వ్యవహారం తర్వాతే.. తాను ఏ నిర్ణయం తీసుకుంటానో చెబుతానని రాజగోపాల్ ఇప్పటికే చెప్పేసారట. అయితే అటు టీడీపీ.. ఇటు బీజేపీ కాదంటే మాత్రం జనసేన నుంచి కూడా పోటీచేసే అవకాశాలు కూడా ఉన్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కూడా లగడపాటికి మంచి పరిచయాలే ఉన్నాయి. ఒకవేళ ఇదే కనుక జరిగితే టీడీపీ, వైసీపీ ఓట్లు కూడా భారీగా చీలిపోయే ఛాన్స్ లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనికంటే ముందు అసలు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు? ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో అన్న సందేహాలు కూడా పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నాయి. మరి లగడపాటి రీ ఎంట్రీ ఎటువంటి పొలిటికల్ ప్రకంపనలను సృష్టిస్తుందో తెలియాలంటే కొద్ది నెలలు ఆగాల్సిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE