రాజధాని అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో నమోదైన కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు, మాజీ మంత్రి పి.నారాయణకు సీఐడీ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఐడీ నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ చంద్రబాబు, నారాయణ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై శుక్రవారం నాడు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వారిపై సీఐడీ విచారణపై స్టే విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ముందుగా ఆ అంశంపై చంద్రబాబు తరఫున న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా, నారాయణ తరఫున న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టులో వాదనలు వినిపించారు. కేసులో ఆరోపణలకు, పెట్టిన సెక్షన్లకు సంబంధం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం సీఐడీ తరపు న్యాయవాది వాదనలు వినిపించగా, చంద్రబాబు, నారాయణపై సీఐడీ నమోదు చేసిన కేసులో ఆధారాలు చూపించాలని కోర్టు కోరింది. అయితే తొలిదశలో ఈ కేసు వివరాలు చెప్పలేమని, పూర్తిస్థాయి విచారణకు అనుమతిస్తే అన్ని విషయాలు తెలుస్తాయని సీఐడీ న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ క్రమంలో ఇరువర్గాల వాదనల అనంతరం ఈ కేసులో చంద్రబాబు, నారాయణపై సీఐడీ చేయదల్చిన విచారణపై స్టే విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అమరావతి అసైన్డ్ భూముల అంశంలో చంద్రబాబుకు సీఐడీ నోటీసులు జారీ చేసినప్పటినుంచి ఆ అంశంపై చర్చ జరుగుతుంది. తాజా కోర్టు తీర్పుతో ఈ కేసులో వారికీ ఊరట లభించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ