కల్కీ భగవాన్ ఆశ్రమాలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. తమిళనాడుకు చెందిన ఐటీ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా వరదాయపాలెం మండలంలోని బత్తులవల్లంలో గల ఏకం గోల్డెన్ సిటీ ఆశ్రమంలో, బి.ఎన్ కండ్రిగ మండలంలో గల మరో కల్కీ భగవాన్ ఆశ్రమంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. అంతే కాకుండా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆశ్రమాలకు సంబంధించిన కార్యాలయాల్లో ఏకకాలంలో 25 చోట్లకు పైగా ఐటీ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. కల్కీ భగవాన్ ఆశ్రమాలపై ఐటీ దాడులతో రాష్ట్రంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.
మరో వైపు కల్కీ ట్రస్ట్ నిర్వాహకుడు, సీఈఓ లోకేష్ దాసోజీని, ఏకం గోల్డెన్ సిటీ వ్యవస్థాపకుడైన భగవాన్ కుమారుడు కృష్ణాజీని ఐటీ అధికారులు వేర్వేరుగా ప్రశ్నిస్తున్నారు. భక్తుల నుంచి సేకరించిన విరాళాలతో స్థలాల కొనుగోళ్లు, డిపాజిట్లు చేయడం వంటి ఆరోపణల నేపథ్యంలోనే ఈ దాడులు జరుపుతున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆశ్రమ సంబంధిత కార్యాలయాల్లో డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది, ఈ రోజు సాయంత్రం వరకు సోదాలు కొనసాగే అవకాశం ఉంది.
[subscribe]