జరగబోయే ఆంధప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం పడిపోతుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. దీనిపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడితో నాలుగు గంటలు భేటీ తర్వాత.. ఎలాంటి లాజికల్ డేటా లేకుండా ప్రశాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు కోట్లాది మందిని కాపాడు… అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. టీడీపీ కోసం పనిచేస్తున్న ప్రశాంత్ కిశోర్.. ఆ పార్టీకి మద్దతు కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. మొత్తంగా ప్రశాంత్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్రదుమారం రేపుతున్నాయి.
ఈనేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ చెబితే నిజమేనా.? అన్నీ జరగాలని ఏముంది అనే చర్చలు నడుస్తున్నాయి. ఆయన బీజేపీ, కాంగ్రెస్ రెండింటికీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో 2012 లో మోదీ మూడవసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యేందుకు కిషోర్ కీలకపాత్ర పోషించారు. 2014 పార్లమెంట్ ఎన్నికలలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సంపూర్ణ మెజారిటీని సాధించడానికి కిషోర్కు చెందిన సిటిజెన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ పనిచేసినట్లు ప్రచారంలో ఉంది. నరేంద్ర మోదీ: ది మ్యాన్, ది టైమ్స్’ పుస్తక రచయిత నీలాంజన్ ముఖోపాధ్యాయ్ మాట్లాడుతూ, 2014 ఎన్నికలకు ముందు నెలల తరబడి పనిచెసిన మోదీ బృందాన్ని నడిపించిన వ్యూహాల్లో కిషోర్ ఒక ముఖ్యమైన వ్యక్తి అని అన్నారు. అంతేకాదు.. 2017 మే లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కిషోర్ను తన రాజకీయ సలహాదారుగా నియమించుకున్నారు. ఐ పాక్ సంస్థ వై ఎస్ ఆర్ కాంగ్రెసు పార్టీకి సమర శంఖారావం, అన్న పిలుపు, ప్రజా సంకల్ప యాత్ర అనే కొన్ని ప్రచార కార్యక్రమ వ్యూహలను సిద్ధం చేసింది ఆయనే. అందువల్లే వైసీపీ 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించింది.
గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలో కీలకపాత్ర పోషించిన ప్రశాంత్ కిశోరే.. ఈఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోతోందని ప్రకటించడం సంచలనంగా మారింది. తెలంగాణలో కేసీఆర్కు పట్టిన గతే జగన్ కూ పట్టబోతోందని ఆయన జోస్యం చెప్పడం చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని తెలిపారు. ఓట్లు వేసేటప్పుడు ప్రజలు అభివృద్ధికే ప్రాధాన్యమిస్తారని.. ఉచిత పథకాలకు కాదని స్పష్టం చేశారు. ‘యువత.. ముఖ్యంగా విద్యావంతులు ఉద్యోగాలు కోరుకుంటారు.. ఇతరత్రా ప్రయోజనాలు కాదు. ఉచితాలపైనే జగన్ పూర్తిగా ఆధారపడ్డారు. దీనివల్ల ఆయన గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు. మామూలు ఓటమి కాదు.. భారీ పరాజయం తప్పదు’ అని తేల్చిచెప్పారు. ప్రజలు సమర్థ నిర్వహణను చూస్తారని.. కేవలం వనరుల నిర్వహణను కాదని చెప్పారు. ప్రజాధనాన్ని ఖర్చుచేస్తూ వారి బాగోగులను చూస్తున్నామని భావిస్తే అది పొరపాటని. జగన్ ఇదే చేస్తున్నారని.. తెలంగాణతో పోల్చి చెప్పారు.
భవంతిలో కూర్చుని బటన్ నొక్కి నేరుగా డబ్బును జమచేసినంత మాత్రాన ఓట్లు రాలవని తేల్చిచెప్పారు. ధనమే కీలకమైతే ఏ ప్రభుత్వమూ ఓడిపోదని పునరుద్ఘాటించారు. దక్షిణాదిన రాజకీయాల్లో డబ్బు సంస్కృతి అలవడిందని.. కానీ తీసుకున్న డబ్బు ఆధారంగా ప్రజలు ఓట్లు వేయరని తెలిపారు. ‘ఎందుకంటే ఉత్తర భారతంలో కంటే దక్షిణాదినే జనం ఎక్కువ ప్రభుత్వాలను మార్చేశారు’ అని చెప్పారు. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ విజయం తథ్యమని ఆయన అంచనా వేశారు. ఈక్రమంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఉత్కంఠ ఏర్పడింది. రాజకీయ పార్టీల భవితవ్యంపై ప్రశాంత్ కిశోర్ చెప్పిన జోస్యం చాలా సందర్భాల్లో నిజమైంది. ఈ క్రమంలో ఏపీలో ఏం జరగబోతోందో వేచి చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY