రైతు చిరునవ్వుతో ఉన్నరోజే నిజమైన పండగ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జాతీయ రైతు దినోత్సవం (డిసెంబర్ 23) సందర్భంగా రైతులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. “రైతే రాజు, దేశానికి వెన్నుముక రైతు లాంటివి మంచి నినాదాలుగా మిగిలిపోవడం సరికాదు. అన్నదాత ఆనందంగా ఉన్నప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుంది. వ్యవసాయ ప్రధానమైన మన దేశంలో రైతాంగం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. పాలకులు ఆ దిశగా దృష్టిపెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభం దిశగా వెళ్తుంది. సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం కావడంతో ప్రకృతి విపత్తులు అన్నదాతలను కుదేలు చేస్తున్నాయి. పంటలు కోల్పోయిన రైతులను ఆదుకొని నష్టపరిహారం ఇచ్చి కోలుకొనేలా చేయడంలో పాలకులు విఫలమవుతున్నారు. తాజాగా మాండౌస్ తుఫాను వల్ల పంటలు దెబ్బ తిన్న రైతాంగం బాధలు వింటే వ్యవసాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అర్ధమవుతోంది. నీట మునిగిన పంట కుళ్లిపోతున్నా అధికార యంత్రాంగం స్పందించలేదు. పంట కాలువల నిర్వహణను విస్మరించారు” అని పవన్ కళ్యాణ్ అన్నారు.
ధాన్యం కొనుగోలు కూడా సక్రమంగా లేదని, అమ్మిన ధాన్యానికి ఎప్పుడు డబ్బులు చెల్లిస్తారో అర్థం కానీ పరిస్థితి నెలకొందని పవన్ కళ్యాణ్ అన్నారు. కౌలు రైతులకు అర్హత కార్డులు ఇవ్వడంలోనూ అర్థం లేని నిబంధలు ఉన్న ఫలితంగా వారికి బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని, ఈ నష్టాల వల్ల కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. “వ్యవసాయ రంగం పచ్చగా కళకళలాడేలా చేయడాన్ని బాధ్యతగా తీసుకోవాలి. స్వేదం చిందించి నేలపై బంగారం పండించే ప్రతి అన్నదాతను గౌరవించుకోవాలి. అందుకే జనసేన ఈ రోజు జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని రైతులను గౌరవించుకొనే కార్యక్రమాలు చేపట్టింది. వ్యవసాయ రంగం వృద్ధి కోసం చర్చలు నిర్వహిస్తోంది. రైతుల ముఖాన చిరునవ్వులు కనిపించిన రోజే నిజమైన పండగ. ఆ రోజు వచ్చేందుకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పని చేయాలి. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ప్రతి రైతన్నకీ నా తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE