జనసేన పార్టీ చేపడుతున్న కౌలు రైతు భరోసా యాత్ర ఆదివారం ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరిగింది. అందులో భాగంగా సత్తెనపల్లి సమీపంలోని ధూళిపాళ్ల గ్రామంలో జరిగిన సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సభలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన మొత్తం 210 మంది కౌలు రైతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబ పరిస్థితిని పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకుని, వారి పిల్లల చదువుకు భరోసానిచ్చారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకొంటున్నారు, ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోతున్నారు ఆదుకోండి అంటే, వారాహి రంగేమిటి, టైర్లు ఎలా ఉన్నాయి, ఎత్తు ఎంత అంటూ వైసీపీ నాయకులు మాట్లాడతారు అంటూ విమర్శించారు.
2014 కూటమి 2019లో లేదు కాబట్టే వైసీపీ గెలిచింది:
“మహనీయులు కాన్షిరాం, విప్లవ ఉద్యమాల్లో పని చేసిన కేజీ సత్యమూర్తి వంటి మహనీయులు అణగారిన వర్గాల అధికారం కోసం ఎంతో కృషి చేశారు. అధికారం దక్కని కులాలకు ఓ దశాదిశా చూపి అధికారం చెప్పట్టేలా ప్రయత్నాలు చేశారు. అయితే అవి పూర్తిస్థాయిలో సఫలీకృతం కాలేదు. అణగారిన వర్గాల వారు అధికారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటే అగ్రవర్ణాలకు వ్యతిరేకం కాదు. అది మన అధికార పోరాటంగా భావించాలి తప్పితే అది ఇతర కులాలపై ఆధిపత్యంగా భావించకూడదు. జనసేన పార్టీకి బలం ఉన్నప్పటికీ, కొన్ని కారణాల రీత్యా 2014 కూటమి 2019లో లేదు కాబట్టే వైసీపీ గెలిచింది. అప్పటి కూటమి ఉండి ఉంటే ఒక చెక్ పాయింట్ మాదిరి ఉండేది. బలమైన ప్రతిపక్షంగా పోరాటం అయినా చేసే అవకాశం ఉండేది. అణగారిన వర్గాలకు అధికారం అంటే అప్పటికే అధికారంలో ఉన్న కులాలను తగ్గించడం కాదు. నాకు ఎల్లలు లేవు. కులం, మతం, ప్రాంతం విషయంలో నేను అతీతుడిని అని చాటిన విశ్వ నరుడు రాసిన కవి గుర్రం జాషువా గారిని అమితంగా ఇష్ట పడే వ్యక్తిని. అయితే క్షేత్ర స్థాయి విషయాలు, వాస్తవ పరిస్థితి గురించి నిర్భయంగా మాట్లాడాలి. అందుకే కులాల గురించి మాట్లాడాల్సి వస్తోంది. ఇప్పటి వరకు అధికారానికి దూరంగా ఉన్న కులాలకు కచ్చితంగా అధికారం అందేలా చూడాలి. దాని కోసం అన్ని కులాలను కలుపుకొని వెళ్తాం. మేము ఏదైనా ప్రజా సమస్యల మీద మాట్లాడితే వైసీపీ నాయకులు వ్యక్తిగత విషయాలు మీద ఓండ్ర పెడతారు. వారం వారం వచ్చి రాజకీయాలు చేస్తాను అంటారు. నేను వారానికి ఒకసారి వచ్చి మాట్లాడితేనే మీకు అంత వణుకు పుట్టుకొస్తోంది. ఇక ప్రతిరోజు నేను మీకు కనబడితే ఎలా ఉంటుందో త్వరలోనే తేలుతుంది. చూడండి.. వైసీపీ నాయకుల తాతలు, తండ్రులు అవినీతి చేసి సంపాదించిన డబ్బు నా దగ్గర లేదు. మీలా నాకు వేల కోట్ల విరాళాలు రాలేదు.. నేను కష్టించి సంపాదిస్తేనే నా పార్టీ నడుస్తుంది. అందుకే పొట్ట పోషణకు నాకు నటన తప్పదు. అది ప్రజలు గుర్తించారు” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం అన్న దానికి కట్టుబడి ఉన్నాం:
“రాజకీయాల్లో దామాషా పద్ధతి లేదు. దీంతో అణగారిన వర్గాల ఓట్లు పూర్తిగా చీలిపోయి ప్రజల ఆస్తులు దోపిడీ చేసే ప్రభుత్వాలు వస్తున్నాయి. ఇలాంటి కులాలన్నింటినీ కలిపి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు పొల్లు పోకుండా చేయడమే లక్ష్యం. ఈ పద్ధతిలో నన్ను ముఖ్యమంత్రిని చేస్తారా చేయరా, అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా, మళ్లీ ఈ ప్రభుత్వం రాకుండా చూసే బాధ్యత తీసుకుంటాం. ఇదే ప్రభుత్వం మళ్ళీ కనుక వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షించడం దేవుడు తరం కూడా కాదు అన్నదే నా బాధ. రాష్ట్రం పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోతుంది. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ రాకుండా చూసే బాధ్యతను తీసుకుంటాం” అని పవన్ కళ్యాణ్ అన్నారు.
నా వ్యూహం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసమే:
“నేను ఎవరికీ కొమ్ము కాయవలసిన అవసరం లేదు. దేనినో ఆశించి రాజకీయాలను వాడుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. నా ఆలోచన, నా వ్యూహం అన్నీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసమే. ప్రజలందరూ నిబంధనలు పాటించాలని నీతులు చెప్పే రాజకీయ నాయకులు వాటిని ఏమాత్రం పాటించకుండా అవినీతి డబ్బు జేబులో వేసుకుంటున్నారు. యువతలో అంతులేని బాధ ఉంది. సమర్ధవంతమైన పాలన వ్యవస్థ ఉంటేనే యువత వేదనను తీర్చే అవకాశం ఉంటుంది. కౌలు రైతులకు ముఖ్యంగా జనసేన ప్రభుత్వంలో పూర్తిస్థాయి అండగా ఉంటాం. మాకు అన్నం పెట్టిన అన్నదాతను ఏమాత్రం విస్మరించం. పటిష్టమైన ప్రభుత్వ పాలసీ విధానాలను రైతుల కోసం తీసుకువస్తాం” అని అన్నారు.
వారాహి మీద ఏపీ రోడ్లమీద తిరుగుతాను, ఎవరు ఆపుతారో చూద్దాం:
“వచ్చే ఎన్నికల్లో అధికారం దూరం అవుతుంది అని వైసీపీ నాయకులకు తెలుసు. దీనికోసం వైసీపీ నాయకులు చేయడానికి ఘోరాలు ఇంకా చాలా చేస్తారు. మాచర్ల లాంటి ఘటనలు చాలా జరుగుతాయి. కార్యాలయాలపై దాడులు చేసి, దహనాలు చేస్తారు. వైసీపీని ఓటమి భయం వెంటాడుతోంది. కచ్చితంగా జనసేన నాయకులు బలంగా పోరాడాలి. భయపడకుండా ముందుకు వెళ్లాలి. ప్రజాక్షేత్రంలో నిలబడండి. నా మీద లారీ పడి రక్తం చిందించడానికైనా, జైలులో కూర్చోవడానికి అయినా సిద్ధంగా ఉన్నాను. నా సినిమాలు ఆపేసుకున్న ఆపేసుకోండి. నన్ను మీ బెదిరింపులు ఏమి చేయలేవు. నేను బంతి లాంటి వాడిని ఎంత కొడితే అంత బలంగా పైకి లేస్తా. జనసేన పార్టీని అధికారంలోకి తెచ్చే నేను తీసుకుంటాను. రాజకీయ వ్యూహం నాకు వదిలేయండి. దశాబ్దం నుంచి నా కష్టంతోనే పార్టీ నడుపుతున్నాను. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎన్నికల వ్యూహం నాకు వదిలేయండి. జనసేన పార్టీని ముందుండి అధికారం దిశగా నడిపించే బాధ్యత నేను తీసుకుంటాను. నన్ను నమ్మండి. వారాహి మీద ఆంధ్రప్రదేశ్ రోడ్లమీద తిరుగుతాను. ఎన్నికల క్యాంపెయిన్ చేస్తాను. ఎవరు ఆపుతారో చూద్దాం” అని పవన్ కళ్యాణ్ అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE