ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని తరలింపునకు సంబంధించి రాష్ట్ర హైకోర్టులో ఉన్న వ్యాజ్యాలలో కౌంటర్ దాఖలు చేయాలని జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ముందుగా రాజధాని అంశంలో కౌంటర్ దాఖలు చేయాలని భావిస్తే మూడు వారాల్లో వేయాలని రాష్ట్ర హైకోర్టు రాజకీయ పార్టీలకు సూచించింది. ఈ క్రమంలో ఆగస్టు 29, శనివారం ఉదయం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇతర పార్టీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “రాజధాని తరలింపు, పాలన వికేంద్రీకరణ విషయంలో జనసేన పార్టీ తొలి నుంచి స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే వస్తోంది. ప్రభుత్వాన్ని విశ్వసించి భూసమీకరణ ద్వారా 33 వేల ఎకరాలను 28వేల మందికి పైగా రైతులు తమ పంట పొలాలను ఇచ్చేశారు. తమ భూములు ఇచ్చిన వేల మంది రైతులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకూడదు అని జనసేన బలంగా చెబుతోంది. అలాగే అక్కడి భూముల్లో ఇప్పటికే నిర్మాణాలు చేపట్టారు. మరికొన్ని నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. అంటే ప్రజాధనాన్ని ఇప్పటికే రాజధాని కోసం వెచ్చించారు. పర్యావరణహితమైన రాజధాని నిర్మాణం జరగాలి అని చెబుతూ వస్తున్నాం” అని అన్నారు
“ప్రస్తుత తరుణంలో రాజధాని తరలింపు అంశంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటికి సంబంధించి పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉన్నాం. గౌరవ హైకోర్టు ఈ వ్యాజ్యాలలో కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. కౌంటర్ దాఖలు చేస్తాం. ఈ కేసులో తుది వరకూ బాధ్యతగా నిలబడతాం. ఈ రోజు పార్టీ ముఖ్యుల అభిప్రాయాలూ తెలుసుకున్నాం. న్యాయ నిపుణుల సలహాలు, వారి సహకారంతో గడువులోగా కౌంటర్ వేస్తాం” అని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ టెలీకాన్ఫరెన్సులో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు తోట చంద్రశేఖర్, టి.శివశంకర్, బొలిశెట్టి సత్య, పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ గారు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu