శాసనసభా వ్యవహారాలు, రాజధాని అమరావతిపై కమిటీ, విశాఖ మెట్రో, మున్సిపల్ ఎన్నికలు వంటి పలు అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. రాజధానిపై స్పష్టత కోసమే ఎక్స్ పర్ట్ కమిటీని వేశామని ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కమిటీ రిపోర్ట్ ను త్వరలోనే సమర్పించనుందని, తర్వాత ఈ విషయంపై పూర్తి స్పష్టత వస్తుందన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి అధ్యయనం నేపథ్యంలో ఏర్పాటు చేసిన కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలో పర్యటిస్తుందని, కమిటీ సమర్పించే నివేదికలోనే రాజధాని అంశం కూడా ఇమిడి ఉందని మంత్రి తెలిపారు. అదేవిధంగా రాజధాని పేరుతో భూములు కోల్పోయిన రైతులందరిని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు.
అసెంబ్లీ శీతాకాల సమావేశాలను టీడీపీ నేతలు సజావుగా జరగనివ్వడం లేదని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు రోజురోజుకు అసహనం పెరిగిపోయి సహనం కోల్పోతున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు రాష్ట్రాన్ని అవినీతి మయంగా మార్చేశారని ఆరోపించారు. విశాఖ మెట్రో నిర్మాణంపై సంబంధిత బృందంతో చర్చలు జరుపుతున్నామని, శంకుస్థాపన ఎప్పుడనేది త్వరలో ప్రకటిస్తామన్నారు. విశాఖ మెట్రోను రెండు దశలుగా చేపట్టాలని నిర్ణయించామని చెప్పారు. అలాగే వచ్చే సంవత్సరంలో రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించే ఆలోచనను ప్రభుత్వం పరిశీలిస్తుందని వెల్లడించారు.
[subscribe]