బుజ్జగించడం అంత చిన్నపని కాదు. కొన్నిసార్లు పార్టీ పెద్దలే దిగివచ్చినా నేతల కోపాన్ని తగ్గించలేదు. పొత్తు ధర్మమేమో కానీ చంద్రబాబుకు పలు నియోజకవర్గాలు పెద్ద తలనొప్పులనే తీసుకొచ్చాయి. ఎన్నికల వేళ హాయిగా ప్రచారం చేసుకోవాల్సిన చంద్రబాబు.. పార్టీ అంతర్గత సమస్యలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో టీడీపీలో అసమ్మతి ఆ పార్టీ నాయకత్వానికి సమస్యగా మారుతోంది. అనపర్తి సీటును బీజేపీకి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బుజ్జగించేందుకు పార్టీ చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ అంశంపై చర్చించేందుకు ఆహ్వానించిన చంద్రబాబును కలిసేందుకు నల్లమిల్లి నిరాకరించారు. ఇక చంద్రబాబు నల్లమిల్లితో ఫోన్లో మాట్లాడినా ఆయనతో సయోధ్య కుదరలేదు. టీడీపీ తొలి జాబితాలో అనపర్తి స్థానానికి పార్టీ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నెల రోజులకు ఆయన పేరును పక్కన పెట్టి మరి బీజేపీకి టికెట్ ఇచ్చింది కూటమి.
నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అటు టీడీపీ సీనియర్ నేతలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, వేగుళ్ల జోగేశ్వరరావు, నిమ్మకాయల చినరాజప్ప, సుజయ్ కృష్ణ రంగారావు, గన్ని కృష్ణ ఇటివలీ నల్లమిల్లి నివాసానికి వెళ్లి సుదీర్ఘంగా మాట్లాడినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఇక టీడీపీ అధినేతను కలిసేందుకు కూడా నల్లమిల్లి విముఖత వ్యక్తం చేశారు. కుటుంబ సమేతంగా నియోజకవర్గంలో పర్యటించి ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటున్నారు నల్లమిల్లి. ఆ తర్వాతే చంద్రబాబును కలిసే విషయంపై ఆలోచిస్తానని టీడీపీ సీనియర్ నేతలకు చెప్పినట్టుగా తెలుస్తోంది.
రెడ్డియేతర కులానికి ఎందుకిచ్చారు?
రామకృష్ణారెడ్డి తండ్రి నల్లమిల్లి మూలారెడ్డి 1983 నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక రామకృష్ణారెడ్డి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 22 ఏళ్లు అధికారంలో ఆ కుటుంబమే ఉంది. అటు ఇప్పటి వరకు పార్టీతో సంబంధం లేకుండా అనపర్తి అసెంబ్లీ సీటును రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే ఇస్తున్నారు. ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేసి ఇప్పుడు రెడ్డియేతర కులానికి టికెట్ ఇవ్వడం అనపర్తి నాట సంచలనం రేపింది. మరోవైపు అనపర్తి సీటును రామకృష్ణారెడ్డికి కేటాయించాలని టీడీపీ కార్యకర్తలు పట్టుబడుతున్నారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ ప్రభావం అంతంత మాత్రంగానే ఉందంటున్నారు. క్షత్రియ కులానికి చెందిన శివ కృష్ణంరాజుకు బీజేపీ టికెట్ కేటాయించడాన్ని తెలుగు తమ్ముళ్లు సైతం వ్యతిరేకిస్తున్నట్టుగా సమాచారం. అయితే మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థి కావడం, మాజీ సైనికుడు కావడంతో శివ కృష్ణంరాజు ప్రజల మద్దతు పొంది విజయం సాధించే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY