ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త కేబినెట్ ఏర్పాటు అనంతరం మంత్రులు వరుసగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. కొత్త కేబినెట్ లో పెడన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ కు గృహ నిర్మాణ శాఖ శాఖను కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జోగి రమేష్ శనివారం ఉదయం సచివాలయంలో ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ముందుగా సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రి జోగి రమేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో పేదవాడి సొంతింటి కలను నిజం చేస్తున్నారని చెప్పారు. విశాఖపట్నంలో ఇళ్ల నిర్మాణం ఫైల్పై తొలి సంతకం చేశానని తెలిపారు.
ముందుగా జోగి రమేష్ కాలేజీ రోజుల నుంచే యూత్ కాంగ్రెస్ విభాగంలో చురుగ్గా ఉండేవారు. కృష్ణా జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, రైల్వే బోర్డు సభ్యుడిగా, ఆర్టీసీ రీజనల్ జోనల్ చైర్మన్గా కూడా ఆయన పనిచేశారు. 2009 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పెడన అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జోగి రమేష్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2013లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మైలవరం నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పెడన నుంచి మళ్లీ పోటీ చేసిన ఆయన టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణ ప్రసాద్పై 7,839 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో తాజా మంత్రివర్గంలో చోటు దక్కించుకుని జోగి రమేష్ తొలిసారిగా మంత్రి బాధ్యతలు చేపట్టారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ