ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారుల అసమర్థత.. గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడువాసులకు శాపంగా మారాయి. కనీస అవసరమైన తాగునీటికీ, సాగునీటికీ కటకటలాడాల్సిన దుస్థితి ఏర్పడింది. బ్రిటిషు పాలనలో పన్నుల నిరాకరణకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది.. ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచే. అలాంటి ప్రత్తిపాడు.. సాగు,తాగునీటి కోసం కూడా వైసీపీ ప్రభుత్వంపై పోరాడక తప్పడం లేదు. గుంటూరు వాహిని ఛానల్ విస్తరణ ఆవశ్యకతను గుర్తించని ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా రైతులు ఎన్నోసార్లు ఉద్యమాలు చేపట్టారు. గత ఏడాది జూలైలో ఏకంగా 30 రోజులపాటు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద దీక్షలు చేపట్టారు. దీక్షలు చేస్తున్న రైతులను అరెస్ట్ చేయడమే కాకుండా, దీక్ష చేసేందుకు వచ్చేవారిని ముందుగానే హౌస్ అరెస్ట్ లూ చేసేవారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్షలో పాల్గొంటే చర్యలు తప్పవనే నోటీసులు ఇచ్చేవారు. వీటికి బెరవకుండా.., రైతులు మహాధర్నా చేపట్టి.. ప్రభుత్వానికి దడ పుట్టించారు. అయినప్పటికీ.. నేటికీ ఇక్కడి ప్రజల కష్టాల తీరలేదు. నీటికోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి మారలేదు.
మునుపెన్నడూ లేని విధంగా ప్రత్తిపాడును తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. వర్షాభావ పరిస్థితులకు తోడు.. పాలకుల నిర్లక్ష్యమే ఇందుకు కారణం. వైసీపీ ప్రభుత్వం హయాంలో సాగర్ జలాలు విడుదల చేసినప్పటికీ.., వంకాయలపాడు మేజర్ కాలవకు నీరు చేరక.. ప్రత్తిపాడులోని చెరువుల పూర్తిస్తాయిలో నిండలేదు. ఉన్న అరకొర నీటినే.. అధికారులు ట్యాంక్ కు ఎక్కించి, మూడు రోజులకోసారి నీటి సరఫరా చేస్తున్నారు. చెరువు ఎండిపోయింది.. బావులు లేవు.. దీంతో స్థానిక ప్రజలు దిక్కుతోచని స్థితిలో నీటిని కొనుక్కుని తాగుతున్నారు. ఇది ప్రభుత్వ అసమర్థత కాదా.. అని తెలుగుదేశం నాయకులు ప్రశ్నిస్తున్నారు.
తాగునీటి కష్టాలు ఒకవైపు.. కలుషిత నీటి సమస్య మరోవైపు.. బోయపాలెం, గొండ్రుపాడు తదితర గ్రామాల్లో తాగునీటిలో మురుగు కలుస్తున్న సందర్భాలు అనేకం. ప్రభుత్వ నిధులతో పనులు చేపట్టలేని వైసీపీ.. కనీసం.. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జలజీవన్ మిషన్ పనులకైనా రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు పూర్తిస్తాయిలో విడుదల చేస్తే ప్రత్తిపాడులో నీటి కష్టాలు ఇంతలా ఉండేవి కావని కూటమి నాయకులు చెబుతున్నారు.
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ.. గుంటూరు చానల్ పొడిగింపు మూడు అడుగులు ముందుకు, ఆరు అడుగులు వెనక్కి అన్నట్టుగానే ఉన్నాయి. చానల్ పొడిగింపు తో 50 గ్రామాల ప్రజలకు తాగునీటితోపాటు సాగు నీటికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. దీనిపై నల్లమడ రైతుసంఘం అలుపెరగని పోరాటం చేస్తున్నా నేటికీ పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదు. విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ.. దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న ఈ నీటి సమస్య పరిష్కారానికి ముందడుగు వేసింది. 2019లో రూ.274.53 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం మార టంతో సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. మరోసారి రైతుల పోరాటం ఫలితంగా స్పందించిన వైసీపీ సర్వేలంటూ హడావిడి చేసి.. పనులు పూర్తిచేయడంపై శ్రద్ధ పెట్టలేదు. కేవలం.. గుంటూరు జిల్లాలోని వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు, పెదనందిపాడు మండలాల్లో సర్వే చేసి.. మమ అనిపించారు. దీంతో గుంటూరు చానల్ పొడిగింపు ప్రక్రియ ప్రశ్నార్థకంగా మారింది.
గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా పోటీచేస్తున్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ సమస్యలన్నింటిపైనా దృష్టి సారించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. వాటిని తీర్చేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY