ఇటీవల కురిసిన అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు న్యాయం జరిగే వరకు అండగా నిలబడతానని ప్రకటించారు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు. రెండురోజుల పర్యటనలో భాగంగా ఆయన గురువారం తొలిరోజు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వర్షాల వల్ల కలిగిన నష్టాన్ని రైతులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. ధాన్యం సేకరణలో జాప్యం, బస్తాలు పంపిణీ చేయకపోవడం, ఇతర నిబంధనలతో తాము పడుతున్న ఇబ్బందులను వారు చంద్రబాబుకు వివరించారు. తొలిరోజు పర్యటన అనంతరం చంద్రబాబు దువ్వలో మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ‘అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. తమ సమస్యలు చెప్పిన రైతులను ప్రభుత్వం బెదిరింపులకు గురి చేస్తోంది. కరోనా కాలంలో కూడా పనిచేసి దేశానికి అన్నం పెట్టిన రైతును కూడా జగన్ సర్కార్ ఇబ్బందులకు గురిచేస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుంది. ఆ ధాన్యాన్ని ఎప్పుడు కొంటారు? అకాల వర్షాలపై రైతులను ఎందుకు అప్రమత్తం చేయలేదు? ధాన్యం సేకరణ ఏప్రిల్ 1 నుండి ప్రారంభం కావాల్సి ఉన్నా.. ఇంకా మొదలవలేదు. రైతులకు చిరిగిన సంచులు, బస్తాలు ఇచ్చారు. లారీకి రూ.25 వేలు తన సొంత డబ్బు చెల్లిస్తే తప్ప రైతుకు ధాన్యం మిల్లుకు రావట్లేదు. నూనె కోసం మిల్లర్లు రైతు నుంచి రూ.80 నుంచి రూ.140 తీసుకుంటున్నారు. మిల్లుల దగ్గర నిరీక్షించాల్సి వస్తే రైతుల నుంచి పెనాల్టీ కూడా వసూలు చేస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో రైతులు తమ ఇష్టం వచ్చినట్లు ధాన్యాన్ని తరలించుకునే అవకాశం ఉండేది. నేడు దానిని తొలగించడంతో రైతులు కష్టాలు పడుతున్నారు’ అని మండిపడ్డారు.
ఇంకా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ విధానాల వల్ల ఒక్కో రైతు సుమారుగా రూ.20 వేల నుంచి రూ. 30 వేలు నష్టపోతున్నాడు. పౌరసరఫరాల శాఖ మంత్రి తన నియోజకవర్గంలోని రైతులను ఎందుకు పట్టించుకోవడం లేదు? నేను పర్యటనకు వస్తానని చెప్పి లారీలు తీసుకొచ్చి ధాన్యం తరలించేందుకు ప్రయత్నించారు. అమరావతిలో కూర్చుని సీఎం జగన్ ఏం చేస్తున్నారు? రైతుల వద్దకు ఆయన ఎందుకు రావడం లేదు? ప్రజలు మీకు ఓటు వేశారు, మీ అధికారులకు కాదు. నమ్మించి ఓట్లు వేయించుకున్న నాయకులు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు? తుఫాను హెచ్చరికలు మళ్లీ వస్తున్నాయి. రైతులను ఎప్పుడు ఆదుకుంటారు? ధాన్యం విక్రయించే రైతులకు సకాలంలో నగదు చెల్లించడం లేదు. ఇదేమని ప్రశ్నిస్తుంటే రైతుల పైనే కేసులు పెడుతున్నారు. కష్టాల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకోకూడదు, కలిసికట్టుగా పోరాడాలి, పోరాడితే పోయేదేమీ లేదు. మీకు అండగా టీడీపీ ఉంటుంది. న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం. చివరి బస్తా ధాన్యం కొనుగోలు చేసే వరకు రైతులకు అండగా ఉంటాం. ప్రభుత్వం మెడలు వంచైనా వారికి న్యాయం చేస్తాం’ అని స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE